కాంగ్రెస్ కొత్త కమిటీలు ఏర్పాటు !

Telugu Lo Computer
0


రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మూడు కొత్త కమిటీలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజకీయ వ్యవహారాల కమిటీతోపాటు టాస్క్‌ఫోర్స్-2024ను ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో జీ-23 నాయకులకు కూడా చోటు కల్పించడం విశేషం. జీ-23 గ్రూపులో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మను ఎనిమిది మంది సభ్యులు గల రాజకీయ వ్యవహారాల కమిటీలో చేర్చారు. ఈ కమిటీలో రాహుల్ గాంధీ కూడా ఉంటారు. టాస్క్‌ఫోర్స్-2024లో ప్రియాంకా గాంధీకి చోటు దక్కింది. ఈ కమిటీలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా ఉండటం విశేషం. రాజకీయ వ్యవహారాల కమిటీ ప్రధానంగా అధినేత్రి సోనియా గాంధీకి సలహాదారులుగా ఉంటారు. ఇందులో మల్లికార్జున ఖర్గే, అంబికా సోని, దిగ్విజయ్ సింగ్, కేసీ వేణుగోపాల్, జితేంద్ర సింగ్ ఉన్నారు. టాస్క్‌ఫోర్స్-2024లో పి.చిదంబరం, ప్రియాంకా గాంధీ, ముకుల్ వాస్నిక్, జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, రణ్‌దీప్ సుర్జేవాలా ఉన్నారు. రాజకీయ వ్యవహారాలు, మీడియా, ఫైనాన్స్, ఎలక్షన్ మేనేజ్‌మెంట్ వంటివి టాస్క్‌ఫోర్స్-2024 కమిటీ చూస్తుంది. ఈ రెండు కమిటీలతోపాటు వచ్చే అక్టోబర్ నుంచి మొదలుకానున్న కాంగ్రెస్ యాత్రను పర్యవేక్షించేందుకు మరో కమిటీని కూడా సోనియా గాంధీ ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ చింతన్ శివిర్ సందర్భంగా ఈ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)