మూడున్నరేళ్ల చిన్నారికి 'కుల, మత రహిత ధృవీకరణ పత్రం జారీ

Telugu Lo Computer
1


తమిళనాడు కేకే పుదూర్‌కు చెందిన ఎస్‌ నరేష్‌ కార్తీక్‌-గాయత్రి దంపతులు తమ మూడున్నరేళ్ల పాపకి 'కుల, మత రహిత ధృవీకరణ పత్రం' పొందింది. ఫలితంగా ఆ చిన్నారి ఏ కులానికి, మతానికి చెందిన మనిషికానట్లే. తమ కుమార్తె విల్మను కిండర్‌గార్టెన్‌లో చేర్పించాలని నిర్ణయించిన ఆమె తల్లిదండ్రులు నరేష్ కార్తీక్-గాయత్రి దంపతులు ఓ స్కూలుకు వెళ్లారు. దరఖాస్తు ఫామ్‌లో కులం, మతం కాలమ్‌ను ఖాళీగా వదిలేస్తే సీటు ఇవ్వం అని కచ్చితంగా చెప్పారు. ఆ స్కూలే కాదు మరికొన్ని స్కూళ్లలో కూడా వారికి అదే పరిస్థితి ఎదురైంది. సీడ్‌రీప్స్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడైన 33 ఏళ్ల నరేష్ మాట్లాడుతూ కులమతాల పేరుతో మా బిడ్డ 'విల్మ'ను నిర్బంధించడం ఇష్టం లేక తన పేరున కుల, మత రహిత సర్టిఫికెట్ తీసుకున్నామని తెలిపారు. విల్మను స్కూల్‌లో చేర్పించేందుకు వెళ్లిన స్కూళ్లలోని దరఖాస్తు ఫామ్‌లో 'నో క్యాస్ట్, నో రిలిజియన్' అనే కాలమ్ లేదని..ఈ రెండింటిని నింపకుండా జాయిన్ చేసుకోబోమని చెప్పారని అన్నారు.నిజానికి 1973లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పిల్లలను స్కూల్లో చేర్చుకునే సమయంలో మతం, కులం తప్పనిసరి కాదు. ఈ విషయం వారికి తెలియదు. స్కూళ్లలో కూడా ఈ ఆదేశాలకు తిలోదకాలు ఇస్తున్నాయి. 1973, 2000వ సంవత్సరంలో తమిళనాడు విద్యా శాఖ రెండు వేర్వేరు ఉత్తర్వులు విడుదల చేసింది. అందులోనూ ఇదే విషయాన్ని పేర్కొంది. 'కులం లేదు, మతం లేదు' అని తల్లిదండ్రులు చెబితే కనుక ఆ కాలమ్‌ను ఖాళీగా వదిలిపెట్టేందుకు ప్రజలను అనుమతించాలంటూ పాఠశాల విద్యా డైరెక్టర్‌ను ఆదేశించింది.కానీ స్కూళ్లు మాత్రం దానికి వ్యతిరేకంగా ఉన్నాయి.మతం, కులం కాలాన్ని నింపకుండా స్కూల్‌లో చేర్చుకోబోమని స్కూల్ యాజమాన్యాలు అవి నింపటం కచ్చితం అని తేల్చి చెప్పడంతో నరేష్ దంపతులు కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ జీఎస్ సమీరన్‌ను సంప్రదించారు. ఆయన కోయంబత్తూరు తహశీల్దారుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారి సమస్య పరిష్కారమైంది. చిన్నారి తల్లిదండ్రులు అఫిడవిట్ సమర్పించడంతో కోయంబత్తూరు నార్త్ తహసీల్దార్ వారికి 'నో రిలిజియన్-నో క్యాస్ట్' సర్టిఫికెట్ జారీ చేశారు. తమిళనాడులో జారీ అయిన తొలి కుల, మత రహిత సర్టిఫికెట్ ఇదే కావటం విశేషం. కాగా, కుల, మత రహిత సర్టిఫికెట్ వల్ల ప్రభుత్వ రిజర్వేషన్లకు, ప్రత్యేకాధికారాలకు తమ కుమార్తె అనర్హురాలిగా మారుతుందని తమకు తెలుసని ఆ అఫిడవిట్‌లో వారు పేర్కొన్నారు.తహసీల్దార్ జారీ చేసిన ధ్రువీకరణ పత్రం ప్రకారం.. బేబీ విల్మ ఏ కులానికి, మతానికి చెందినది కాదు. ‘మతం లేదు, కులం లేదు’ అనే సర్టిఫికేట్‌ను పొందొచ్చన్న విషయం చాలామంది తల్లిదండ్రులకు తెలియదని, ఇటువంటి ధ్రువీకరణ పత్రాన్ని పొందటానికి మరింత మంది తల్లిదండ్రులు ముందుకు వస్తారని ఆశిస్తున్నానని నరేష్ తెలిపారు.

Post a Comment

1Comments

  1. ఇలాంటి మంచి పని చేయడానికి హిందువులు మాత్రమే ముందుకు వస్తారు..కాని మిగతా మతాల వాళ్ళు అన్ని రకాల సౌకర్యాలు పొందడానికి మరియు తమ ఉనికిని చాటుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు.

    ReplyDelete
Post a Comment