రాజస్థాన్లోని జైపూర్ జిల్లాలోని చాపియా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులను వివాహం చేసుకున్న ఆ మహిళలు నాలుగు రోజుల క్రితం నుండి కనిపించకుండా పోయారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కోడళ్లు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఆ ముగ్గురు కోడళ్లలో ఇద్దరు గర్భిణీలు కావడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మృతి చెందిన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు 4 ఏళ్ల బాలుడు కాగా, మరొకరు 27 రోజుల పసిపాప. వీరి ఆత్మహత్యలకు అత్తింటి వారి కట్నం వేధింపులే కారణమని తెలుస్తోంది. తాజాగా వారి మృతదేహాలు ఓ బావిలో లభ్యమయ్యాయి. ఘటనపై మహిళల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ పిల్లలను వరకట్నం కోసం వారి భర్తలు వేధించేవారని, మే 25న తనకు ఫోన్ చేసి తమ భర్తలు, వారి బంధువులు కొడుతున్నారని చెప్పారని చెప్పాడు. గ్రామానికి వెళ్లి అల్లుళ్లను తన కుమార్తెల గురించి అడిగితే తననూ చంపేస్తామంటూ బెదిరించారంటూ ఫిర్యాదులో బాధితురాళ్ల తండ్రి వాపోయాడు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని రాజస్థాన్లోని మహిళా కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ అక్కాచెల్లెళ్ళు అనుభవించిన బాధను అర్థం చేసుకోవాలని, ఇది అత్యంత దారుణమైన నేరమంటున్నారు. మహిళలను అత్యంత కిరాతకంగా హింసించడమే ఈ దారుణానికి కారణమని మహిళా సంఘాలు ఆరోపించాయి. ఈ దారుణంపై ఉన్నతాధికారులు నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలంటున్నారు.
ముగ్గురు అక్కాచెల్లెళ్లు బావిలో దూకి ఆత్మహత్య !
May 29, 2022
0
Tags