ముంచుకొస్తున్న 'అసని' తుఫాను

Telugu Lo Computer
0


తూర్పు తీరంలో అసని తుఫాను ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అసని 2022లోనే మొదటి తుఫానుగా భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అండమాన్ సముద్రం నుంచి బంగాళాఖాతం(ఉత్తరం) వైపు కదులుతున్న అసని మే 10న ఆంధ్ర - ఒడిశా లేదా ఒడిశా - పశ్చిమబెంగాల్ వద్ద తీరం దాటనున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తుఫాను తీరం దాటే సమయంలో గాలుల వేగం 90 కి.మీ.ల వరకు ఉంటుందని అధికారులు హెచ్చరించారు. తుఫాను ధాటికి మే 8 నుంచి బెంగాల్‌, ఒడిశాలోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను నేపథ్యంలో అండమాన్ తో పాటు ఒడిశా, పశ్చిమబెంగాల్, సిక్కిం, అస్సాం, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. తుఫాను ప్రభావం ఎక్కువగా ఒడిశాపైనే ఉంటుందన్న అధికారులు ఆమేరకు హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను నేపథ్యంలో ఒడిశా మొత్తం హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీచేశారు. తుఫాను నేపథ్యంలో ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పికె జెనా శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్‌డిఆర్‌ఎఫ్, ఒడిఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ సూచన మేరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ఇప్పటికే వేటకు వెళ్లినవారిని వెనక్కు పిలిపించినట్లు ఆయన తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసినట్లు పికె జెనా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ తీరంలోని విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు అసని తుఫాను ప్రభావం ఉంటుందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో స్థానిక విపత్తు నిర్వహణశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. తుఫాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలో 75 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, కుండపోత వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ సంచాలకులు వివరించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)