కేంద్రీయ విద్యాలయాల్లో కొత్త మార్గదర్శకాలు !

Telugu Lo Computer
0


కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు విద్యార్థులను సిఫార్సు చేసే పలు కోటాలను కేంద్రం రద్దు చేసింది. ఇందులో ఎంపీ కోటా కూడా ఉంది. కేంద్రీయ విద్యాలయ సంగఠన్‌ జారీ చేసిన సవరించిన అడ్మిషన్ గైడ్‌లైన్స్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దీనివల్ల కేంద్రీయ విద్యాలయాల్లో ఆయా కోటాల పరిధిలో ఉన్న 40,000లకు పైగా సీట్లు సాధారణ విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. ఇదివరకు ఒకొక్క ఎంపీ 10 మంది పిల్లల చొప్పున 788 మంది ఎంపీలు 7,880 మంది విద్యార్థులను సిఫార్సు చేసే వీలుండేది. జిల్లా మేజిస్ట్రేట్‌లకు కూడా 17 మంది విద్యార్థులను సిఫార్సు చేసే అధికారం ఉండేది. మరోవైపు విద్యా మంత్రిత్వ శాఖ ఉద్యోగుల పిల్లలు, ఎంపీల పిల్లలు, మనవళ్లు, కేంద్రీయ విద్యాలయాల విశ్రాంత ఉద్యోగుల సంతానం, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌ కోటా ఇలా వివిధ కోటాల్లో ప్రత్యేక ప్రవేశాలను కల్పించేవారు. వీటన్నింటినీ కేంద్రం రద్దు చేసింది. ఈ కోటాల్లో ప్రవేశాల వల్ల తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిపోవడం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు వక్రీకరణకు గురికావడం జరిగేదని, ఈ సమస్యను పరిష్కరించేందుకే వీటిని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే జాతీయ శౌర్య పురస్కార గ్రహీతల పిల్లలకు, రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ ఉద్యోగుల సంతానానికి, విధి నిర్వహణలో మరణించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు, కళల్లో ప్రత్యేక ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే కోటాలను మాత్రం కొనసాగించనుంది. పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ పథకం కింద కొవిడ్‌ కారణంగా అనాథలైన పిల్లలను కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ప్రత్యేకంగా పరిగణించాలని కేంద్రం నిర్ణయించింది. విద్యార్థుల గరిష్ఠ సంఖ్య దాటినా వీరికి ప్రవేశాలు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం జిల్లా మేజిస్ట్రేట్‌ ఇచ్చే జాబితా ఆధారంగా ఒక్కో కేంద్రీయ విద్యాలయంలో 10 మంది పిల్లలకు ప్రవేశం కల్పించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)