ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవవర్ధన్ రెడ్డిని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆయన నిందితుడిగా ఉన్న కేసుకు సంబంధించిన పత్రాలు నెల్లూరు కోర్టులో అపహరణకు గురికావడం పెనుదుమారం రేపింది. రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఆయన సన్నిహితులకు సంబంధించిన విల్లాలో ఓ యువకుడి అనుమాస్పద మరణం మరో వివాదానికి కారణమైంది. మంగళగిరి రూరల్ మండలం కాజలోని విల్లాలో షేక్ మహమద్ అనే 20 ఏళ్ల యువకుడి మృతికి విద్యుత్ షాక్ కారణమని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ మృతిపై దర్యాప్తు జరగాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి నమోదైన ఎఫ్ఐర్లోని సమాచారం ప్రకారం- మంగళగిరి పట్టణంలోని టిప్పర్ల బజారులో నివసించే మహమద్ అనే యువకుడు ఒక ఏసీ మెకానిక్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తారు. మసీదు వీధిలోని న్యూ స్టార్ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ వర్క్స్లో పనిచేసే తన సహచరుడితో కలిసి మహమద్ ఏసీ మరమ్మతుల కోసం కాజలోని ఐజేఎం అపార్ట్మెంట్స్ పేరుతో ఉన్న రెయిన్ ట్రీ పార్క్ విల్లాకి ఏప్రిల్ 16 (శనివారం) ఉదయం 10 గంటల ప్రాంతంలో వెళ్లారు. 11 గంటల సమయంలో విల్లా పైఅంతస్తులో మహమద్ చనిపోయి పడి ఉండటాన్ని ఆయనతోపాటు వచ్చిన ఏసీ మెకానిక్ గుర్తించారు. వెంటనే మహమద్ కుటుంబీకులకు సమాచారం అందించారు. స్థానికులతో కలిసి సమీపంలో ఉన్న ఎన్నారై ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధరించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. మహమద్ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. మహమద్ నానమ్మ షేక్ కమురున్నీసా ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్.ఐ.ఆర్ నెం. 229/2022 గా కేసు నమోదు చేశారు. సీఆర్ పీసీ సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
కాకాని గోవర్ధన్ రెడ్డి ని చుట్టుముడుతున్న వివాదాలు
April 19, 2022
0
Tags