పుల్వామాలో ఉగ్ర కుట్ర భగ్నం !

Telugu Lo Computer
0


జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో లష్కరే తోయిబా ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రవాదులతో సంబంధాలున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరుగురు జమ్మూకశ్మీర్‌లోని యువతను హైబ్రిడ్ టెర్రరిస్టులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయుధాలు, డబ్బు సమకూర్చడం, ఆశ్రయం కల్పించడం ద్వారా వారిని ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నారు. పట్టుబడిన నిందితులను లెల్హర్ కాకాపొరాకు చెందిన రవుఫ్ అహ్మద్ అలియాస్ అంజిద్, అలోచిబాగ్ పాంపూర్‌కి చెందిన అఖిబ్ మక్బూల్, లార్వే కాకాపొరాకు చెందిన అహ్మద్ దార్, సజద్, పుల్వామాకు చెందిన అర్షిద్ అహ్మద్, రమీజ్ రాజాలుగా గుర్తించారు. లష్కరే తోయిబా అధికార ప్రతినిధి రియాజ్ అహ్మద్ దార్ అలియాస్ ఖలీద్ అలియాస్ షీరజ్ కోసం ఈ ఆరుగురు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటివరకూ జమ్మూకశ్మీర్‌లో 150 మంది హైబ్రిడ్ టెర్రరిస్టులను అరెస్ట్ చేసినట్లు గురువారం కశ్మీర్ ఐజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 'ఉగ్రవాద సంస్థల కోసం క్షేత్రస్థాయిలో పనిచేసేవారిని గుర్తించడం కష్టం. అలాంటివారు శాశ్వతంగా అందులోనే ఉండిపోరు. కొన్ని ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకుని.. ఆ తర్వాత సైలెంట్ అయిపోతారు. సాధారణ జీవితం గడుపుతారు. అందుకే వారిని మేము హైబ్రిడ్ టెర్రరిస్టులని పిలుస్తాం. ఈ ఏడాది ఇప్పటివరకూ 150 మంది హైబ్రిడ్ టెర్రరిస్టులను అరెస్ట్ చేశాం.' అని పేర్కొన్నారు. గతంలో ఉగ్రవాద లింకులు ఉన్న కుటుంబానికి చెందినవారు, రాళ్ల దాడుల ఘటనలతో సంబంధం ఉన్నవారు ఇలాంటి యువత మాత్రమే చేతుల్లోకి ఆయుధాలు తీసుకుంటున్నారని ఐజీ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)