నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని అందిస్తున్న హోటల్కు బల్దియా రూ.5 వేల జరిమానా విధించింది. పురుగులతో ఉన్న ఆహారం వచ్చిందంటూ నేరేడ్మెట్కు చెందిన రాబిన్ ఫిర్యాదు చేయగా.. స్పందించిన బల్దియా అధికారులు డిఫెన్స్ కాలనీలోని శ్రీ రాఘవేంద్ర హోటల్ తనిఖీ చేపట్టారు. అపరిశుభ్ర వాతావరణంలో హోటల్ నిర్వహిస్తున్నారని గుర్తించి కొరడా ఝుళిపించారు. రాబిన్ అనే వ్యక్తి బుధవారం ఉదయాన్నే అల్పాహారం కోసం జొమాటోలో రైస్ పొంగల్ ఆర్డర్ ఇచ్చారు. తింటున్న క్రమంలో తొలుత ఉల్లిపాయ అని పొరపాటు పడినా తర్వాత పురుగు అని తెలియడంతో వెంటనే ఫొటోలు తీసి ట్విటర్లో బల్దియా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులకు, జొమాటో సీఈవోకు ఫిర్యాదు చేశారు. ఆ ఆహారం వల్ల విపరీతంగా వాంతులు అయ్యాయని, రోజంతా ఆహారం తీసుకునేందుకు మనస్కరించలేదని వాపోయారు. వెంటనే ఆ హోటల్ లైసెన్స్ రద్దు చేయాలని కోరగా ఫిర్యాదును స్వీకరించినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ రిఫరెన్స్ నంబర్ పంపించింది. ఫిర్యాదుకు స్పందించిన జొమాటో ఆహార నాణ్యత అంశం తమ పరిధిలో ఉండదని బదులిచ్చింది.
పొంగల్లో పురుగు !
March 31, 2022
0
Tags