తమిళనాడు లోని తిరువణ్ణామలై కలసపాక్కంకు చెందిన ఏళుమలై (45), అతడి బంధువైన చరణ్రాజ్ (26) మధ్య ఆస్తితగాదాలు ఉన్నాయి. ఇరువురూ రైతులే. ఈ నేపథ్యంలో చరణ్రాజ్ తన ప్రత్యర్థి ఏళుమలైని హత్యచేయడానికి సిద్ధమయ్యాడు. ఏళుమలై రోజూ రాత్రిపూట పొలంలో నిద్రపోతున్నాడని తెలుసుకుని అతడిని హతమార్చేందుకు అదే అనువైన సమయమని చరణ్రాజ్ భావించాడు. ఆ మేరకు మంగళవారం రాత్రి పొలంలో ఇనుపమంచంపై నిదురపోతున్న ఏళుమలైని కరెంట్షాక్ ఇచ్చి చంపాలనుకున్నాడు. పక్క పొలంలోని విద్యుత్ స్తంభంపై వేలాడుతున్న విద్యుత్ తీగెకు ఇనుపకొక్కీ తగలించి విద్యుత్ తీగెను ఏళుమలై మంచానికి తగిలించి హతమార్చాలనుకున్నాడు. అయితే ఇనుప మంచానికి విద్యుత్ తీగెను తగిలించే సమయంలో ఊహించని విధంగా చరణ్రాజ్కు విద్యుదాఘాతానికి గురయ్యాడు. చరణ్రాజ్ పెట్టిన చావు కేకలు విని మంచంపై నిదురపోతున్న ఏళుమలై లేచి కరెంట్షాక్కు గురికాకుండా తప్పించుకున్నారు. ఈ ఇరువురు పెట్టిన చావు కేకలు విని పక్కపొలంలో నిద్రపోతున్న బంధువు వేణుగోపాల్ (33) పరుగెత్తుకొచ్చి నేలపై విద్యుత్ తీగెను చేతపట్టుకుని ఉన్న చరణ్రాజ్ను చూసి కాపాడేందుకు ప్రయత్నించాడు. చరణ్రాజ్ దేహాన్ని తాకగానే వేణుగోపాల్ విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్ళి ఇరువురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కలసపాక్కం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బెడిసికొట్టిన హత్యాయత్నం!
March 09, 2022
0