తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారం పరిధిలోని కాచనపల్లి పోలీస్స్టేషన్లో తుపాకీ మిస్ ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు. వరంగల్ జిల్లా గవిచర్ల హెడ్కానిస్టేబుల్ సంతోష్ స్వస్థలం. కాగా కాచనపల్లి పోలీస్స్టేషన్లో సంతోష్ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి విధుల సమయంలో ఆయుధాలను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు ఓ తుపాకీ పేలిందని పోలీసు అధికారులు తెలిపారు. దీంతో సంతోష్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తుపాకీ మిస్ ఫైర్ కావడానికి గల కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
మిస్ఫైర్తో హెడ్కానిస్టేబుల్ దుర్మరణం
February 12, 2022
0
Tags