ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ లో భారత్‌ జట్ల ఓటమి

Telugu Lo Computer
0


ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో గ్రూపు దశ చివరి లీగ్‌ మ్యాచ్‌ల్లో మన జట్లు ఓటమి పాలయ్యాయి. దీంతో పురుషులు, మహిళల జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాయి. శుక్రవారం జరిగిన గ్రూపు దశ చివరి లీగ్‌ మ్యాచ్‌ల్లో భారత జట్లకు చుక్కెదురైంది. పురుషుల గ్రూపు-ఎలో భారత్‌ 2-3తో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇండోనేసియా చేతిలో పోరాడి ఓడింది. మూడు లీగ్‌ మ్యాచ్‌ల్లో ఒకేఒక్క విజయంతో పట్టికలో మూడో స్థానంలో నిలిచిన భారత్‌ నాకౌట్‌ బెర్తుకు దూరమైంది. ఇండోనేసియా, కొరియా సెమీస్‌ చేరుకున్నాయి. మహిళల గ్రూపు-వై పోరులో భారత్‌ 1-4తో జపాన్‌ చేతిలో పరాజయం చవిచూసింది. గ్రూపు దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన భారత్‌ అట్టడుగు స్థానంలో నిలిచింది. మలేసియా, జపాన్‌ ముందంజ వేశాయి. చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు పోరాడింది. తొలి సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ 21-18, 27-25తో వార్డోయో చికోపై గెలిచి భారత్‌కు శుభారంభం అందించాడు. మొదటి డబుల్స్‌లో మంజిత్‌సింగ్‌- డింకూసింగ్‌ జోడీ 16-21, 10-21తో లియో రోలీ- మార్టిన్‌ డానియెల్‌ జంట చేతిలో ఓడటంతో 1-1తో స్కోరు సమమైంది. రెండో సింగిల్స్‌లో కిరణ్‌ జార్జ్‌ 13-21, 21-17, 10-21తో లియోనార్డో ఇమాన్యుయెల్‌ చేతిలో పోరాడి ఓడాడు. రెండో డబుల్స్‌లో హరిహరన్‌- రుబన్‌కుమార్‌ జంట 10-21, 10-21తో ఫిక్రి మహ్మద్‌- మౌలానా బాగాస్‌ జోడీ చేతిలో పరాజయం చవిచూడటంతో ఇండోనేసియా 3-1తో భారత్‌పై పైచేయి సాధించింది. మూడో సింగిల్స్‌లో మిథున్‌ మంజునాథ్‌ 21-12, 15-21, 21-17తో యొనాథన్‌పై నెగ్గి భారత్‌కు ఊరట విజయాన్ని అందించాడు. మహిళల విభాగంలో సింగిల్స్‌లో అష్మిత మాత్రమే గెలిచింది. చాలిహ 21-17, 10-21, 21-19తో గుంజి రైకోపై నెగ్గింది.

Post a Comment

0Comments

Post a Comment (0)