కరోనా మహమ్మారి కారణంగా 2020 మార్చి నుంచి మొదలైన వర్క్ ఫ్రమ్ హోం విధానానికి ఐటీ కంపెనీలు స్వస్తి పలుకుతున్నాయి. ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని ఆదేశాలు జారీచేస్తున్నా యి. కొవిడ్ మూడో దశ ముగింపునకు చేరుకోవటం, భవిష్యత్తులోనూ వైరస్ ప్రభావం పెద్దగా ఉండదన్న నిపుణుల సూచనలతో కంపెనీలు ఆఫీసుల నుంచే పనులు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. వర్క్ ప్రమ్ హోం విధానంలో హైదరాబాద్ నగరంతోపాటు ఇతర రాష్ట్రాలు, జిల్లా కేంద్రాలు, స్వగ్రామాల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా ఆఫీసులకు రావాలంటే కనీసం నెల నుంచి రెండు నెలల సమయం పడుతుంది. ఈ మేరకు ఆయా కంపెనీలు ఉద్యోగులకు ముందస్తు సమాచారం ఇస్తున్నాయి. ఏప్రిల్ నుంచి 50 శాతం ఉద్యోగులు పనిచేసేందుకు అనువుగా కార్యాలయాలను సిద్ధం చేస్తున్నాయి. రెండు నెలల తర్వాత పూర్తిస్థాయిలో కంపెనీల నుంచే కార్యకలాపాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఉద్యోగుల పనితీరులో సరికొత్త విధానాలు అమల్లోకి రావడం, డిజిటలైజేషన్ పెరిగి ఐటీ కంపెనీలకు పెద్ద మొత్తంలో కొత్త ప్రాజెక్టులు వస్తుండటంతో ఐటీ ఉద్యోగులకు గణనీయమైన డిమాండ్ నెలకొన్నది. దీంతో ఉద్యోగులు కూడా ఆఫీసులకు వచ్చి పనిచేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. రెండు నెలల్లో మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, నానక్రాంగూడ, కోకాపేట ప్రాంతాల్లోని ఐటీ పార్కులు, టవర్లు పూర్వవైభవం సంతరించుకోనున్నాయి. వర్క్ ఫ్రమ్ హోం కారణంగా ఐటీ కంపెనీల్లో మూతపడిన హోటళ్లు, ఫుడ్ కోర్ట్స్, బేకరీలు, ఫాస్ట్పుడ్ సెంటర్లు తెరుచుకొని, ప్రైవేటు క్యాబ్ సర్వీసులు ప్రారంభమై వేలమందికి ఉపాధి లభించనున్నది.
వర్క్ ఫ్రమ్ హోంకు ఐటీ కంపెనీలు స్వస్తి!
February 21, 2022
0
Tags