హైదరాబాద్ శివారు ముచ్చింతల్ శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రవేశ రుసుములను ప్రకటించారు. సమతా కేంద్ర సందర్శనకు టికెట్ ధర 6-12 ఏళ్ల లోపు చిన్నారులకు రూ.75, ఆపై రూ. 150 ప్రవేశ రుసుముగా నిర్ణయించారు. ఐదేళ్లలోపు చిన్నారులను ఉచితంగా అనుమతిస్తారు. ఈ కేంద్రంలో కొన్ని అభివృద్ధి పనులు ఇంకా కొనసాగుతుండడంతో ఈ నెల 19 వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ఆ తర్వాతి రోజు నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లోనూ భక్తులను అనుమతిస్తారు. ప్రస్తుతానికి శ్రీరామనుజాచార్యుల సువర్ణమూర్తి విగ్రహ దర్శనం, త్రీడీ మ్యాపింగ్ లేజర్ షో, ఫౌంటేన్లను తాత్కాలికంగా నిలిపివేశారు. బంగారు విగ్రహం చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఫ్రేం ఏర్పాటుతోపాటు ఇతర పనులు పూర్తి కావడానికి మరో వారం రోజుల వరకు పట్టే అవకాశం ఉంది. 11వ శతాబ్దానికి చెందిన రామానుజాచార్య యొక్క 216 అడుగుల ఎత్తైన విగ్రహం ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ కేంద్రాన్ని సందర్శించారు.
సమతామూర్తి సందర్శనకు టికెట్!
February 17, 2022
0
Tags