ఉక్రెయిన్​పై యుద్ధం మొదలయింది !

Telugu Lo Computer
0


ఉక్రెయిన్​లో సైనిక ఆపరేషన్ చేపట్టనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పౌరులను కాపాడేందుకే ఈ చర్యలు చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజలను ఉద్దేశించి టెలివిజన్​ ద్వారా ప్రసంగించిన పుతిన్ ఉక్రెయిన్ నుంచి ఎదురవుతున్న ముప్పుకు స్పందనగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్​ను ఆక్రమించుకోవాలని తమకు ఎలాంటి లక్ష్యం లేదని పుతిన్ పేర్కొన్నారు. రక్తపాతానికి ఉక్రెయిన్ పాలకులదే బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ సమాజానికి హెచ్చరికలు చేశారు. రష్యా చేపట్టిన చర్యల్లో తలదూర్చేందుకు ప్రయత్నిస్ 'ఇదివరకు ఎన్నడూ చూడని పరిణామాలు చూడాల్సి ఉంటుంది' అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. "ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకోవడం మా ప్రణాళికలో భాగం కాదు. ఉక్రెయిన్​లో సైనికీకరణకు వ్యతిరేకంగా పనిచేస్తాం. ఈ విషయంలో కలగజేసుకోవాలని ప్రయత్నించినా మా దేశం, మా ప్రజలకు ముప్పు కలిగేలా ప్రయత్నించినా రష్యా వెనువెంటనే తగిన చర్యలు తీసుకుంటుంది. చరిత్రలో ఎన్నడూ జరగని పరిణామాలకు ఇది దారితీస్తుంది." అని వ్లాదిమిర్ పుతిన్ ప్రకటన చేసిన నిమిషాల వ్యవధిలోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్​లో పేలుడు సంభవించింది. రష్యా సైనిక దళాలే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పుతిన్ ప్రకటనపై అమెరికా నిమిషాల్లోనే స్పందించింది. రష్యా చేసే ఈ దాడుల వల్ల జరిగే విధ్వంసం, ప్రాణనష్టానికి ఆ దేశానిదే పూర్తి బాధ్యత అని పేర్కొంది. అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి ఐకమత్యంతో దీనికి నిర్ణయాత్మకంగా స్పందిస్తుందని అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. రష్యాను ప్రపంచం బాధ్యుల్ని చేస్తుందని స్పష్టం చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)