రామాయణంతో సహా ప్రాచీన భారతీయ సాహిత్యాన్ని ఉర్దూలోకి అనువదిస్తామని ఛాన్సలర్ ముంతాజ్ అలీ ఖాన్ చెప్పారు . హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ స్కాలర్స్ ఈ ప్రయత్నం చేస్తారన్నారు. వర్సిటీకి ఛాన్సలర్గా నియమితులైన తరువాత తొలిసారి అలీఖాన్ యూనివవర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం అనే ట్యాగ్ నుంచి ఉర్దూకు విముక్తి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే భారతీయ భాషగా ఉర్దూకు సరైన గుర్తింపునిస్తూ.. దానికి ఉన్న మతపరమైన కళంకాన్ని తొలగించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఉర్దూ సరళమైన భాష అని వచనం, కవితల రూపంలో రామాయణాన్ని ఉర్దూలోకి మరింత ఆకర్షణీయంగా అనువాదం చేసేందుకు అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల కోసం 13 భారతీయ భాషలలో ఉర్దూను ఒకటిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఉర్దూ బాషకు ప్రాధాన్యత లభించేలా యూనివర్సిటీలో అనేక సంస్కరణలను ప్రవేశపెడతామని అలీ ఖాన్ అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉర్దూలో లీగల్ కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్ మాట్లాడుతూ న్యాయశాస్త్రంలో మాస్టర్స్ కోర్సును అందించడానికి నల్సార్ యూనివర్సిటీతో ఇటీవల ఓ అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా ఉర్దూలో అనేక సర్టిఫికేట్ కోర్సులను త్వరలో ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా అకడమిక్ క్రిడిట్ బ్యాంకును అమలు చేసేందుకు యూనివర్సిటీ ప్రణాళికలు రూపొందిస్తుందని, దీని ద్వారా విద్యార్థులకు ఎంతో మేలు జరగనుందని హసన్ పేర్కొన్నారు.