పాఠ్య పుస్తకంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని మాయం!

Telugu Lo Computer
0


విద్యార్థులను దేశ రాజధాని ఏది అంటే ఢిల్లీ అని, ఇతర రాష్ట్రాల రాజధానుల గురించి అడిగినా చెబుతారు.  కానీ, ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చే సరికి మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగావుంది. ఏపీ రాజధాని ఏది? అంటే మాత్రం సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. విద్యార్థులే కాదు, ఆ పాఠాలు బోధించే ఉపాధ్యాయులు కూడా చెప్పలేని పరిస్థితి. అంతెందుకు రాష్ట్ర ప్రభుత్వానిదీ అదే పరిస్థితి అని చెప్పొచ్చు. అందుకేనేమో ప్రభుత్వం కూడా పాఠ్యపుస్తకాల్లో ఏపీ రాజధానికి సంబంధించి వివరాలను ఎగ్గొట్టింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి 2020-21కి గానూ కొత్త పాఠ్య పుస్తకాలను ముద్రించింది. అయితే, నాలుగో తరగతి 'మన ప్రపంచం' పాఠ్యపుస్తకంలో ముద్రించిన ఇండియా మ్యాప్ నుంచి ఏపీ రాజధాని మాయమైంది. ఈ పాఠ్యపుస్తకాల్లో ఇండియా మ్యాప్‌ను, రాష్ట్రాలు, వాటి రాజధానుల పేర్లను కూడా ముద్రించారు. కానీ, ఏపీ విషయంలో పరిస్థితి భిన్నంగా మారింది. ఏపీ మ్యాప్ వద్దకు వచ్చే సరికి కేవలం ఆంధ్రప్రదేశ్ అని మాత్రమే రాసి సరిపెట్టారు. రాజధాని ఏంటో పేర్కొనలేదు. దీన్ని ఫోటో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడది వైరల్‌గా మారింది. ఇదీ రాష్ట్ర పరిస్థితి అంటూ నిట్టూరుస్తున్నారు. ప్రభుత్వానికే క్లారిటీ లేనప్పుడు విద్యార్థులు మాత్రం ఏం చెబుతారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే.. అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం కేవలం రాష్ట్రం పేరు చెప్పి వదిలేయడంపై ఉపాధ్యాయులు, విద్యావంతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ మ్యాప్ చూపించి అన్ని రాష్ట్రాలు, రాజధానుల గురించి విద్యార్థులకు చెప్పేటప్పుడు ఏపీ రాజధాని గురించి ఏం చెప్పాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)