పెట్రోలు కూడా కొనలేని స్థితిలో శ్రీలంక ప్రభుత్వం

Telugu Lo Computer
0


శ్రీలంకను కొత్తగా మరో సంక్షోభం చుట్టుకుంది. చమురు నిల్వలు అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆ దేశంలోని అనేక ఇంధన స్టేషన్లలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ దుస్థితికి ప్రధాన కారణం అక్కడి ప్రభుత్వం దగ్గర అవసరమైన విదేశీ మారకం లేకపోవడమే. దీంతో దిగుమతులకు చెల్లింపులు చేసేందుకు సైతం అక్కడి ప్రభుత్వం దగ్గర తగినంత నిధులు నిల్వ లేవు. చెల్లింపులు నిలిచిపోవడంతో దేశంలోకి వచ్చిన చమురు సైతం పోర్టుల్లోనే నిలిచిపోయింది. స్వయంగా ఆ దేశ ఇంధన శాఖ మంత్రి ఉదయ గమ్మన్‌పిల ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా వల్ల టూరిజం దెబ్బతినడంతో లంకకు కష్టాలు వరస కట్టాయి. ఇప్పటికే శ్రీలంక పెట్రోలియం కార్పొరేషన్‌, సిలోన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ బ్యాంకులకు 3.3 బిలియన్‌ డాలర్లు మేర చెల్లింపులు బాకీ పడ్డాయి. పెట్రో ఉత్పత్తుల కోసం.. ఇటీవలే భారత్ సైతం లంకకు 500 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించింది. లంకలో ఉన్న కొద్ది పాటి చమురు నిల్వలను కాపాడటానికి అక్కడి ప్రభుత్వం ఇంపోర్ట్ బ్యాన్ చేసింది. అప్పటి నుండి ఆహారం, ఆయిల్, పవర్ అన్నీ నిలిచిపోయాయి. ఫారెక్స్ నిల్వలు క్షీణించడంతో.. పాల పొడి నుంచి పవర్ వరకు అన్నీ కష్టంగానే మారాయి. వంద శాతం సేంద్రియ ఉత్పత్తులను పండిచాలని శ్రీలంక ప్రభుత్వం 2021లో తీసుకున్న ఓ నిర్ణయం వల్ల.. సంక్షోభం ఏర్పడి బ్లాక్ మార్కెట్‌ లో వరి, పంచదార, ఉల్లిపాయలు సహా నిత్యావసరాలు అమాంతం పెరిగాయి. ఉదాహరణకు పంచదార కిలో రూ. 200, బియ్యం కిలో రూ. 150 లకు అమ్ముడవుతున్నాయి. వీటికి తోడు వంట గ్యాస్ ధర సిలిండర్ రూ. 2657 కు చేరింది. అమెరికా డాలర్‌తో పోల్చితే 2018లో 153 ఉన్న శ్రీలంకన్ రూపాయి మారకపు విలువప్రస్తుతం 203 కు దిగజారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)