కరోనా సెకండ్ వేవ్ సమయంలో బ్రెజిల్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నది. ప్రజలు మాస్క్ పెట్టుకోనవసరం లేదని స్వయంగా ఆ దేశాధ్యక్షుడు బొల్సోనారో చెప్పడంతో మాస్క్ పెట్టుకోకుండా తిరిగారు. దీంతో ఆ దేశంలో కరోనా విలయతాండవం చేసింది. ఆ సమయంలో లక్షలాది మంది కరోనా బారిన పడ్డారు. వేలాది మంది చనిపోయారు. చేతులు కాలాక అకులు పట్టుకున్న చందాన, కరోనా మహమ్మారి విజృంభణ తరువాత మాస్క్ తప్పనిసరి చేశారు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అప్పటి నుంచి అధ్యక్షుడు బొల్సోనారోపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. 66 ఏళ్ల బొల్సోనారో తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. వైద్యులు పెగుకు శస్త్రచికిత్స చేయాలని చెప్పినట్టు తెలిపారు. అసలే ఆవేశంగా ఉన్న ప్రజలు, అధ్యక్షుడిని వైద్యం చేయవద్దని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బొల్సోనారో అనుచిత నిర్ణయాల వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.