ప్రాణం తీసిన సెల్ఫీ మోజు !

Telugu Lo Computer
0


 ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో తాడిమర్రి మండలం దాడితోట గ్రామంలో చిత్రావతి నదిలో ప్రేమజంట గల్లంతైంది. అయ్యవారిపల్లి గంగమ్మ గుడి దగ్గర సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రియురాలు రామాంజినమ్మ ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో ప్రియుడు అమర్నాథ్ కూడా కాలువలో కొట్టుకుపోయాడు. బుక్కరాయసముద్రం మండలం కొత్తచెదుల్ల గ్రామానికి చెందిన 22 ఏళ్ల పిచ్చికుంట్ల అమర్‌నాథ్, అనంతపురం ప్రకాష్‌నగర్‌కు చెందిన 20 ఏళ్ల రామాంజినమ్మ గత కొంతకాలంగా ప్రేమించు కుంటున్నారు. అమర్‌నాథ్‌ అనంతపురంలో సెంట్రింగ్‌ పనులు చేస్తుంటాడు. రామాంజినమ్మ ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తుంది. దాడితోట మండలానికి చెందిన పరశురాం అనే యువకుడు అమర్‌నాథ్‌ దగ్గర పని చేస్తున్నాడు. పరశురాం సంక్రాంతి పండక్కి తమ బంధువుల ఇంటికి వచ్చాడు. ముగ్గురు కలిసి మధ్యాహ్నం భోజనం చేశాక చిత్రావతి జలాశయం చూసి, అయ్యవారిపల్లి గంగమ్మ గుడి దగ్గరికి చేరుకున్నారు. ఓ సెల్ఫీ దిగాలి అన్న కోరిక వారి ప్రాణాలను బలితీసుకుంది. బ్యాక్ గ్రౌండ్ బాగుందని, రామాంజినమ్మ అక్కడ ఓ సెల్ఫీ దిగే ప్రయత్నం చేసింది. అయితే ప్రమాదవశాత్తు కాలు జారడంతో ఆమె కాలువలోకి వెంటటే పడిపోయింది. ప్రియురాలు కళ్లముందే పడిపోవడంతో షాక్ నుంచి తేరుకున్న ప్రియుడు ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ కాస్త జారుడుగా ఉండడంతో అమర్‌నాథ్‌ కూడా కాలువలో పడ్డాడు. పరశురాం వారిని గమనించేలోపు కాలువ మధ్యలో లోతుగా ఉండడం.. ఇద్దరూ గుంతలోకి వెళ్లడం క్షణాల్లో జరిగిపోయాయి. జరిగిన విషయాన్ని పరశురాం గ్రామస్తులకు, పోలీసులకు తెలిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గల్లంతైన జంట కోసం ఈతగాళ్లు, ఫైర్ సిబ్బందితో వెతికించారు. పోలీసుల గాలింపులో మొదట అమ్మాయి మృతదేహం లభ్యమైంది. ఆ తర్వాత అబ్బాయి మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను అనంతపురం మార్చురీకి తరలించారు. ఈ ఘటన ఇరువురు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)