లక్ష దాటిన రోజువారీ కరోనా కేసులు

Telugu Lo Computer
0


దేశంలో రోజువారీ కేసులు లక్ష దాటాయి. గడిచిన 24 గంటల్లో 1,17,100 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గురువారం దేశవ్యాప్తంగా 30,836 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న 302 మరణాలు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే ఏకంగా లక్షకు పైగా కేసులు రావడంతో ప్రజల్లో మళ్లీ ఆందోళన నెలకొంది. కొత్త కేసులు ఏకంగా 216 రోజుల గరిష్టానికి చేరుకున్నాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,52,26,386కి చేరింది. భారత్‌లో ఇప్పటి వరకు 3,43,71,845 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,83,178 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 3,71,363 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసులు మూడు లక్షలు దాటడంతో అన్ని ప్రభుత్వాలు మళ్లీ ఆస్పత్రుల్లో సౌకర్యాలపై దృష్టిసారించాయి. దేశంలో టెస్ట్ పాజిటివిటీ భారీగా పెరుగుతోంది. ఏకంగా 7.74 శాతానికి పెరిగింది. పశ్చిమ బెంగాల్‌లో 24.71 శాతానికి చేరింది. అంటే ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా సోకింది. మహారాష్ట్రలో 21.28, గోవాలో 20.47, ఢిల్లీలో 15.34 శాతంగా పాజిటివిటీ రేటు ఉంది.  మహారాష్ట్రపై పరిస్థితి దారుణంగా ఉంది. 25శాతం కేసులు ఆ ఒక్క రాష్ట్రంలోనే ఉన్నాయి. మహారాష్ట్రలో ఏకంగా 36,265 కొత్త కోవిడ్ కేసులు వచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లో 15,421 కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 15,095, కేరళలో 4,649, కర్నాటకలో 5,031 కేసులు నమోదయ్యాయి. నిన్న 15.13 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. నిన్న దేశవ్యాప్తంగా 94.47 లక్షల మందికి కరోనా టీకాలు వేశారు. ఇప్పటివరకు 149.66 కోట్లకు పైగా డోస్‌ల వ్యాక్సిన్ వేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)