ఆమె చదివింది పదో తరగతి...!

Telugu Lo Computer
0

 

ఆమె పేరు నందిని. వయస్సు 33 సంవత్సరాలు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరానికి సమీపంలో ఓ చిన్న గ్రామంలో ఉండేది. ఆమె తండ్రి పూజారి. దేవాలయంలో పనిచేసేవాడు. అయితే చిన్నప్పటి నుంచి నందినికి డాక్టర్ కావాలనే కోరిక బలంగా ఉండేది. కానీ కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండడంతో ఆమె 10వ తరగతి వరకు మాత్రమే చదువుకుంది. ఈ క్రమంలో వయస్సు రాగానే ఆమెకు పెళ్లి చేశారు. ఆమె భర్త పేరు శ్రీకాంత శాస్త్రి. అతను కూడా పూజారే. అయితే తండ్రి చనిపోవడంతో నందినిపై చెల్లెలి పెళ్లి భారం పడింది. దీంతో ఆమెకు కష్టాలు ఎదురయ్యాయి. భర్త సంపాదనతోపాటు తాను కూడా చిన్న చిన్న పనులు చేసి సంపాదించేది. అయితే అది ఏ మూలకూ సరిపోయేది కాదు. ఈ క్రమంలోనే ఆమె బంధువుల్లో దగ్గరి వారైన కొందరు ఊబర్ సంస్థ గురించి చెప్పారు. అందులో క్యాబ్ నడిపిస్తే దాని వల్ల లాభం ఉంటుందనే సరికి ఆమె, ఆమె భర్త కలిసి తమ వద్ద ఉన్న నగలు తాకట్టు పెట్టి టయోటా కారు కొని ఊబర్‌లో తిప్పడం స్టార్ట్ చేశారు. అయితే అది కాకుండానే ఊబర్‌లో డబ్బు సంపాదించేందుకు ఇంకో మార్గం కూడా వారికి దొరికింది. అదేమిటంటే. ఊబర్ సంస్థకు ఎవరినైనా రిఫర్ చేసి అందులో క్యాబ్ డ్రైవర్లను చేర్పిస్తే అలా చేర్పించిన వారికి రిఫరల్ అమౌంట్‌ను ఇస్తారు. అది రూ.3వేల వరకు ఉంటుంది. దీంతో నందిని ఆమె భర్త కూడా ఆ పని స్టార్ట్ చేశారు. అందుకోసం ఏకంగా ఓ చిన్నపాటి ఆఫీసును పెట్టి అందులో నలుగురికి పని కల్పించారు. అలా ఆ ఆఫీసు ద్వారా ఇప్పటి వరకు నందిని, ఆమె భర్త కలిసి 600 మంది డ్రైవర్లను ఊబర్‌లో చేర్పించారు. దీంతో ఒక్కసారిగా ఆమె ఆదాయం కూడా పెరిగింది. ఇప్పుడు ఆమె నెలకు రూ.2 లక్షల వరకు సంపాదిస్తోంది. అవును, మీరు విన్నది నిజమే. ఓ వైపు క్యాబ్‌లు తిప్పడం, మరో వైపు రిఫరల్స్‌ను చేర్పించడం.. ఇదీ.. ఆమె చేస్తున్న పని. అందుకే ఇప్పుడా స్థాయికి ఆమె చేరుకుంది. ఏది ఏమైనా ఆమె పడ్డ శ్రమకు తగిన ఫలితం లభించింది కదా. అయితే ఇప్పుడు నందిని మనస్సులో ఉన్న ఆశ ఒక్కటే. తాను ఎలాగూ డాక్టర్ కాలేకపోయింది. తన కూతుర్నయినా డాక్టర్‌ను చేయాలని ఆమె ఆలోచిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)