తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఈ నెల 15న కుమారుడు సాయి భాను ప్రకాశ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా, తండ్రి ఈ ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. రాంబాబు కుటుంబం ఖమ్మంలో నివాసం ఉంటోంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో సాయి పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 14న స్నేహితులతో కలిసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ వేడుకల విషయమై సాయిని పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు మందలించారు. మరోవైపు పాఠశాల యాజమాన్యం వారం రోజుల పాటు సస్పెండ్ చేసింది. ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అతడిని హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 16న సాయి మృతిచెందాడు. స్వగ్రామం సత్తుపల్లిలో కుమారుడి అంత్యక్రియలు పూర్తి చేసిన అనంతరం రాంబాబు నిన్న రాత్రి 11గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లాడు. ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా ఈ ఉదయం కుమారుడిని ఖననం చేసిన ప్రాంతంలోనే చెట్టుకు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. ఈ ఘటనతో సత్తుపల్లి లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుమారుడి మృతి తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య
December 19, 2021
0
Tags