హైదరాబాద్ లో లింక్‌రోడ్లను అభివృద్ధి

Telugu Lo Computer
0


గ్రేటర్‌ హైదరాబాద్ లోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ ఒత్తిడిని తగ్గించడంతో పాటు ప్రయాణ దూరం, సమయాన్ని ఆదా చేసేందుకు నగరవ్యాప్తంగా ప్రభుత్వం లింక్‌రోడ్లను అభివృద్ధి చేస్తున్నది. మొత్తం 133 లింక్‌రోడ్లను దశలవారీగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా మొదటి దశలో రూ.313 కోట్లతో 22 లింక్‌ రోడ్ల పనులను ప్రారంభించి ఇప్పటికే పూర్తి చేసింది. ఇక రెండో దశలో 13 చోట్ల రూ.232 కోట్లతో పనులు చేపట్టింది. ఈ పనులన్నీ యుద్ధప్రాతిపదికన సాగుతుండగా అదే సమయంలో మూడో దశ పనులపైనా దృష్టి సారించింది. రూ.491 కోట్లతో 29 కారిడార్లలో లింక్‌ రోడ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ట్రాఫిక్‌ సమస్య, ప్రయాణ దూరం తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా రహదారులను అభివృద్ధి చేస్తున్నది. పెరుగుతున్న జనాభా, జన సాంద్రతను దృష్టిలో ఉంచుకొని కొత్త రోడ్ల నిర్మాణం, ఉన్న రోడ్ల పరిరక్షణ, లింకు రోడ్లకు వేర్వేరుగా ప్రణాళికలతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నది. ఆరువేల కోట్లతో ఎస్‌ఆర్‌డీపీ పనులు, రూ.1800కోట్లతో సీఆర్‌ఎంపీ రోడ్లు, హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఆర్‌డీసీఎల్‌) ఆధ్వర్యంలో మొదటి దశలో రూ. 313.65కోట్లతో 22 లింకు రోడ్ల నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేశారు. 133 లింకు రోడ్ల నిర్మాణ పనుల్లో భాగంగా దశల వారీగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇటీవల రెండవ దశలో రూ.232.62 కోట్ల వ్యయంతో కొత్తగా 13 చోట్ల లింకు రోడ్ల నిర్మాణపనులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. రెండవ విడత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతుండగా, రూ.65.94 కోట్లతో మూడు చోట్ల కలిపి 6.38 కిలోమీటర్ల మేర పనులు ఊపందుకున్నాయి. రూ.92.54 కోట్లతో ఐదు చోట్ల 9.50 కిలోమీటర్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇక మిగిలిన ఎనిమిది చోట్ల 12.48 కిలోమీటర్ల పరిధిలో లింకు రోడ్లకుగాను రూ.140.08 కోట్ల పనులకు డిటెల్ట్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే రెండవ విడత పనులు శరవేగంగా జరుపుతూనే తాజాగా మూడవ విడత పనులపై దృష్టి సారించారు. మూడవ విడతలో రూ.491.49 కోట్లతో 29 కారిడార్లలో 36.67 కిలోమీటర్ల లింకు రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. అత్యధిక శాతం గ్రేటర్‌ పరిధిలోనే ఈ లింకు రోడ్ల నిర్మాణం ఉండటం గమనార్హం. మొత్తంగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ ఒత్తిడిని తగ్గించి, ప్రయాణ దూరాన్ని, సమయాన్ని ఆదా చేసేందుకు అనువుగా నగర వ్యాప్తంగా స్లిప్‌రోడ్లు, లింకు రోడ్లను నిర్మిస్తున్నారు. రోడ్ల నిర్మాణానికిగాను జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు భూ సేకరణ పూర్తి చేస్తుండగా, హెచ్‌ఆర్‌డీసీఎల్‌ విభాగం అధికారులు రహదారుల నిర్మాణ పనులను కొనసాగిస్తున్నారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎప్పటికప్పుడు కొత్త రహదారులను నిర్మిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)