ఎమ్మిగనూరు సమీపంలోని ఎల్లెల్సీ కాల్వ వద్ద జరిగిన గొల్ల గోవిందు హత్య కేసు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వినోద్ కుమార్ గురువారం వెల్లడించారు. పెద్దకడబూరు మండలం హనుమాపురానికి చెందిన రామాంజనేయులు భార్యతో అదే గ్రామానికి చెందిన గొల్ల గోవిందు రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమెను తీసుకెళ్లి కర్ణాటకలోని సిరుగుప్పలో ఉంచాడు. దీనిని అవమానంగా భావించిన రామాంజనేయులు తన బావమరిది ఆనంద్తో కలిసి హత్యకు పథకం రచించాడు. గోవిందుతో సన్నిహితంగా ఉండే బోయ ఈరన్న, శేషాద్రితో చేయి కలిపారు. ఆలూరు సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గుప్త నిధులు ఉన్నాయని, పూజలు చేయాలని కర్ణాటక నుంచి గోవిందును రప్పించారు. పథకం ప్రకారం ఆటోలో ఆలయం వద్దకు తీసుకెళ్లి అక్కడే దారుణంగా హత్య చేశారు. విషయం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మృతదేహాన్ని ఎమ్మిగనూరు వద్ద పడేశారు. విచారణ అనంతరం నిందితులను అరెస్టు చేసి వారి నుంచి మారణాయుధాలు, చరవాణులు, ఆటో స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. సీఐలు మంజునాథ్, శ్రీనివాస్ నాయక్, ఎస్సై సునీల్ కుమార్, పోలీసులు పాల్గొన్నారు.