తమిళనాడులోని వెల్లూరు జిల్లా కవనూర్ మొట్టూర్ ప్రాంతానికి చెందిన వినాయకమ్ అనే 23 ఏళ్ల యువకుడు, వెలంపట్టు ప్రాంతానికి చెందిన రంజిత్ అనే 25 ఏళ్ల యువకుడు మంచి స్నేహితులు. పాల వ్యాపారం చేస్తుండే వీరిద్దరి మధ్య ఓ మహిళ వ్యవహారంలో జరిగిన గొడవ ఘర్షణకు దారితీసింది. వినాయకమ్కు ఆంటీ వరసయ్యే ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది. వినాయకమ్తో పాటు అతని కుటుంబం ఆమెకు చేదోడువాదోడుగా ఉంటోంది. అయితే వినాయకమ్తో కలిసి అప్పుడప్పుడు ఆమె ఇంటికి వెళ్లిన రంజిత్ ఆ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం కొన్ని నెలల తర్వాత వినాయకమ్కు తెలిసింది. తమ కుటుంబంలో ఒకరైన మహిళతో తన స్నేహితుడు రంజిత్ వివాహేతర సంబంధం కొనసాగించడంతో వినాయకమ్ తట్టుకోలేకపోయాడు. తమ కుటుంబం ఎంతో నమ్మితే ఇలాంటి పని చేస్తావా అంటూ రంజిత్తో వినాయకమ్ గొడవ పెట్టుకున్నాడు. ఈ విషయంలో రంజిత్కు, వినాయకమ్కు మధ్య గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ గొడవ కారణంగా రంజిత్పై పగ పెంచుకున్న వినాయకమ్ మరో నలుగురితో కలిసి అతనిపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో వినాయకమ్ స్నేహితుడు ఒకరు రంజిత్ను కత్తితో పొడిచాడు. కత్తి వీపులోకి దిగిపోవడంతో తీవ్ర గాయాలపాలైన రంజిత్ రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడు. పోలీసులు అక్కడికి చేరుకుని రంజిత్ను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎంతో కష్టపడి అతని వీపులో దిగిన కత్తిని తొలగించారు. వినాయకమ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేవీ కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో వినాయకమ్కు సాయం చేసిన మరో నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మహిళ విషయంలో యువకునికి కత్తిపోట్లు !
December 21, 2021
0