హైదరాబాద్ నగరంలోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే తర్వాత రెండో స్థానంలో మరో ఫ్లైఓవర్ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. జీహెచ్ఎంసీ సెంట్రల్ డివిజన్ పరిధిలోని షేక్పేట్ ఫ్లైఓవర్ అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈ పనులను 2018 ఏప్రిల్లో ప్రారంభించారు. రూ.333.55 కోట్లతో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన ఈ ఫ్లైఓవర్ పనులు మూడున్నరేళ్లలో పూర్తిచేశారు. కులీ కుతుబ్షాహి టూంబ్స్, ఫిలింనగర్, ఓయూకాలనీ, విస్పర్ వ్యాలీ జంక్షన్ల మీదుగా ఈ వంతెన చేపట్టారు. గెలాక్సీ థియేటర్ నుంచి మల్కం చెరువు వరకు 2.71 కిలోమీటర్ల మేర ఈ వంతెన నిర్మించారు. 24 మీటర్ల వెడల్పుతో ఆరు లైన్లతో ఈ ఫ్లైఓవర్పై వాహనాల రాకపోకలకు సిద్ధం చేశారు. ఎక్కడా సిగ్నల్స్ లేకుండా గమ్యస్థానాలకు చేరేలా ఈ ఫ్లైఓవర్ ఎంతో ఉపయోగపడనుంది. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ ఫ్లైఓవర్ వాహనదారులకు అనుకూలంగా ఉంటుంది. షేక్పేట్ ఫ్లైఓవర్ పనులు పూర్తి అయ్యాయి. దాంతో పాటు ఓవైఈ జంక్షన్ ఫ్లైఓవర్ పనులు కూడా పూర్తయ్యాయని, ఈ నెలాఖరుకు రెండు ఫ్లైఓవర్లను ప్రారంభిస్తామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. నూతనంగా నిర్మించిన షేక్పేట్ ఫ్లైఓవర్ను ఆమె పరిశీలించారు.