భారత్-చైనా మధ్య అనేక అనుమానాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదాల పరిష్కారానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ అన్నారు. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలన్నింటినీ ఒకేలా చూడాలన్నారు. లద్దాఖ్, ఈశాన్య ప్రాంతంలోని సమస్యల్ని వేరువేరుగా చూడాల్సిన అవసరం లేదన్నారు. ''2020లో ఇరుదేశాల మధ్య సమస్యలు నెలకొన్నాయి. అవన్నీ చర్చల ద్వారా సద్దుమణుగుతున్నాయి. సైనిక, దౌత్య, ప్రభుత్వాల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత వివాదాలన్నింటినీ పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. అవన్నీ పరిష్కారం అవుతాయని భారత్ విశ్వసిస్తోంది. గతంలోనూ సరిహద్దు సమస్యలు వచ్చాయి. వాటన్నింటినీ పరిష్కరించుకున్నాం. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సమస్యల పరిష్కారానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. గతంలో సుమ్దొరోంగ్ చూ అనే ప్రాంతంలోనూ ఇదే తరహాలో గొడవలు జరిగాయి. వాటి పరిష్కారానికి చాలా సమయం పట్టింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు వేగంగా అడుగులు పడుతున్నాయి'' అని రావత్ అన్నారు.