ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇరాన్కు వలసలు పెరుగుతున్నాయి. రోజుకు సుమారు 4 వేల మంది ఆఫ్ఘన్లు దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నారని అన్నారు. దేశంలో ఆర్థిక, మానవతావాద సంక్షోభం నెలకొనడమే దీనికి కారణమని అధికారులు తెలిపారు. గతంలో ఆఫ్ఘపన్ నుండి ఇరాన్కు నెలకు సుమారు 1,000 నుండి 2,000 మంది వరకు వెళ్ళేవారని, నిమ్రోజ్లోని జరంజ్ బోర్డర్ స్టేషన్ నుండి ఇరాన్లోకి ప్రవేశించేవారని నిమ్రోజ్ ప్రావిన్స్ బోర్డర్ కమాండర్ మహమ్మద్ హషీమ్ హంజలేహ్ అన్నారు. ఆఫ్ఘన్ను తాలిబన్లు ఆక్రమించుకున్న అనంతరం సరిహద్దులను దాటేందుకు ప్రయత్నించేవారి సంఖ్య రోజుకు 3,000 నుండి 4,000 మందికి పెరిగిందని చెప్పారు. సరిహద్దులను దాటేందుకు అవసరమైన పత్రాలు కూడా లేవని అన్నారు. వ్యాపారులు, రెసిడెన్స్ వీసాలుగలవారు, వైద్య సేవల కోసం వెళ్ళేవారు ఇరాన్లోకి వెళ్ళగలుగుతున్నారన్నారు. రోజుకు సుమారు 600 మందిని ఇరాన్ దళాలు అనుమతిస్తున్నాయని మీడియాకు వివరించారు.
అయితే ఆఫ్ఘనిస్తాన్ పౌరులపై ఇరాన్ సైనికులు దారుణంగా వ్యవహరిస్తున్నారని బాధితులు మీడియాకు వెల్లడించారు. వారి నుండి డబ్బులు లాక్కుని, గాయపరుస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ఇరాన్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఒక ఆఫ్ఘన్ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.