క్రూరపాత్ర ధరించినా, అక్రూరపాత్ర ధరించినా, హాస్యపాత్ర ధరించినా నటనలో దేనికదే భిన్నంగా వుండేది. వివిధ భూమికా నిర్వహణ సమర్థుడు అనిపించుకున్నారు లింగమూర్తి. తమిళ చిత్రం ఆధారంగా నిర్మించిన ఆడజన్మలో అతిగా నటించారన్న పేరు తెచ్చుకున్నారు. తరువాత అది పాత్ర, పరిస్థితి కారణంగా అలా చేశానని చెప్పుకొన్నారు లింగమూర్తి, యస్.వీ.రంగారావు. లింగమూర్తికి పాత్ర, దర్శకుడు, పారితోషికం అన్నీ నచ్చితేనే సినిమాలు ఒప్పుకొనే వారు. దీని కారణంగా ఆయన ఎక్కువ చిత్రాల్లో నటించలేదు. అన్ని విషయాల్లోనూ కచ్చితమైన మనిషి. ముక్కుకి సూటిగా పోయే మనస్తత్వం, రాజీపడని మనస్తత్వం. మొహమాటం వుండేది కాదు. ఏదైనా కుండ పగలగొట్టినట్టు చెప్పేవాడు. సభల్లో మాట్లాడినప్పుడు కూడా నిర్మొహమాటంగా, బల్లగుద్ది మాట్లాడేవారు. లింగమూర్తిగారు మాట్లాడతారంటే, ప్రేక్షకుల్లో చిన్న కలకలం లేచేది - ఎవర్నో గట్టిగా దుయ్యబడతారని. నిజానికి దర్శకుడు చెప్పింది వేదం. అతను చెప్పింది చెయ్యాలి. కాని మనం కూడా ‘కన్విన్స్’ కావాలిగదా! గుడ్డిగా వెళ్లడం నాకు చేతకాదు. అది డిసిప్లిన్కి విరుద్ధయమైతే నేనేం చెయ్యలేను. ఒకసారి బి.ఎన్.రెడ్డితోనే వచ్చింది. ‘స్వర్గసీమ’లో నేను భానుమతి తండ్రిని. పల్లెటూరివాడిని. హాస్యంపాలు కూడా వున్న పాత్ర అది. హీరోని వల్లో వేసుకోవాలని కూతురితో చెప్పే సన్నివేశం వుంది. ‘ఎన్నాళ్లని ఈ బిగువు? వాడేం దయ్యమా, రాక్షసుడా? దగ్గరకెళ్లి అంతా సరిచేసుకో’ అని డైలాగు. అందులో నాకు చమత్కారం కనిపించలేదు. ఆ మాటే బి.ఎన్.తో అంటే కస్సుమని లేచాడాయన. ‘చమత్కారం ఏం చేస్తావో చేసి చూపించు!’ అని కోపంగా అన్నాడు. ‘నేను చెప్తాను బాగుంటే వుంచండి - లేకపోతే ఉన్నదే చెప్తాను’ అన్నాను. ‘చెప్పు’ అన్నట్టు మొహం పెట్టారు డైరెక్టరు ధుమధుమలాడుతూనే. ‘వాడేం పులా, సింగమా?’ అని ‘వూ’ అని చమత్కారంగా అన్నాను. ‘వూ’ అనడంలో ఒక చమత్కారం వచ్చింది. డైరెక్టరూ, రైటరూ సరే అన్నారు. సినిమాలో ఆ మార్పు బాగానే పట్టుకుంది జనాన్ని‘అని ఒక సందర్భంలో చెప్పారు లింగమూర్తి. ’అందుకే కొందరు దర్శకులూ, నిర్మాతలూ నా జోలికిరారు. పోనీ! అనేవారాయన. నర్తనశాల (1963) లో శకుని వేషానికి లింగమూర్తిని అడిగారు. ‘అప్పుడు నాకు వేషాలులేవు. ఖాళీగానే వున్నాను. అంచేత డబ్బు తగ్గించమన్నారు. నేను తగ్గించనన్నాను. ’నాకు సినిమాలు తగ్గవచ్చు కాని, నా టాలెంట్ తగ్గలేదు. మీరిచ్చే డబ్బు నా టాలెంట్కి!‘ అని చెప్పేశాను’ అని చెప్పారొకసారి. ‘పాండవవనవాసం’లో రంగారావు ధుర్యోధనుడు. లింగమూర్తి శకుని. ‘ఈ సీనులో రంగణ్ని జయిస్తాను చూడు!’ అని లింగమూర్తి అంటే ‘రమ్మను, నా శక్తి నేనూ చూపిస్తాను’ అని రంగారావు అనేవారు. ‘అలాంటి ఆరోగ్యకరమైన పోటీలు వుండేవి. నాటకరంగం మీదా అంతే!’ అన్నారు లింగమూర్తి.
‘టాకీషాట్స్లో సైలెంట్ రియాక్షన్స్ ఇవ్వడంలో లింగమూర్తి గట్టివాడు’ అని కె.వి. రెడ్డి పొగిడేవారు. దానికి ఉదాహరణ: ‘యోగి వేమన’ చివరి దృశ్యంలో వేమన చివరిసారిగా అభిరాముడిని (లింగమూర్తి) హత్తుకుంటారు. ఆ షాటులో లింగమూర్తి వీపు మాత్రమే కెమెరా వైపు వుంటుంది. కనిపించేది నాగయ్యే. ‘వేమన కావలించుకోగానే, ఒళ్లు పులకరించినట్టు, జలదరించినట్టు లింగమూర్తి వీపుతోనే ఎక్స్ప్రెషన్ ఇచ్చారు.గ్రేట్!’ అని అభినందించారు కె.వి.రెడ్డి ఒక సందర్భంలో. ‘యాక్షన్ కంటె రియాక్షన్ కష్టం. మన రియాక్షన్ బాగుంటే, అవతలి నటుడి యాక్షనూ మెరుగుపడుతుంది’ అని చెప్పేవారా మహానటుడు. ఆయన రేడియో నాటకాల్లో కూడా తరుచూ పాల్గొనేవారు. ‘అక్కడ వాచకమే ప్రధానం. కళ్లతోనూ, చేతులతోనూ చేసే నటనంతా ఒక్క కంఠంతో చెయ్యాలి. దాని కష్టం దానికుంది’ అని చెప్పేవారు. పానగల్ పార్కుకి సాయంకాలం పూట కాలక్షేపం కోసం వెళ్లినా, మిత్రులతో సంభాషించినా ‘ప్రయోజనం’ కనిపించకపోతే నిష్క్రమించేవారాయన.1960లలో షష్టిపూర్తి తర్వాత లింగమూరి వయోభారం వల్ల సినీరంగం నుండి విరమించారు.1974లో భార్య చనిపోయిన తర్వాత పూర్తిగా సన్యాసాశ్రమం పుచ్చుకొని వారణాసిలో జీవించసాగారు.ఈయన 1980 జనవరి 24న వారణాసిలో మరణించారు.