కొవిడ్-19 సంక్షోభం వల్ల ఆన్లైన్ కొనుగోళ్లు పెరిగిన నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాలు కాపాడేలా ఈ-కామర్స్ సంస్థలు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) తెలిపింది. అందులో భాగంగా విక్రేతలకు సంబంధించి పూర్తి వివరాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. విక్రేతల చిరునామా, ఫిర్యాదుల అధికారి వివరాలు వంటి వివరాలను తప్పనిసరిగా ఉత్పత్తులతో జతచేయాలని సూచించింది. ఈ మేరకు సీసీపీఏ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ వర్గాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ (ఈ-కామర్స్) నిబంధనలు, 2020 ప్రకారం.. కొన్ని ఈ-కామర్స్ సంస్థలు ఈ వివరాలను అందుబాటులో ఉంచడం లేదని ఫిర్యాదులు అందిన నేపథ్యంలోనే ఈ మార్గదర్శకాలు జారీ చేయాల్సి వస్తోందని సీసీపీఏ తెలిపింది. ఈ మార్గదర్శకాలను అమలు చేయని పక్షంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని సీసీపీఏ కమిషనర్ అనుపమ్ మిశ్రా తెలిపారు. ఏప్రిల్-జులై త్రైమాసికంలో నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్ (ఎన్సీహెచ్)కు ఈ-కామర్స్ సంస్థలపై 69,208 ఫిర్యాదులు అందాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సీసీపీఏ స్పందించింది.