హెర్డ్‌ ఇమ్యూనిటీ కోసం డెల్టా బారిన పడాల్సిందే..!

Telugu Lo Computer
0

 

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి నుంచి బయటపడేందుకు సహకరించే హెర్డ్‌ ఇమ్యూనిటీ దేశ రాజధాని దిల్లీలో చాలా కష్టమని నిపుణుల బృందం స్పష్టం చేసింది. కొవిడ్‌ రెండో దశ దిల్లీని కకావికలం చేసిందని.. అక్కడ హెర్డ్‌ ఇమ్యూనిటీ ఇప్పట్లో కష్టమేనని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తేల్చి చెప్పింది. హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించేందుకు డెల్టా బారిన పడటం లేదా.. బూస్టర్‌ డోసు తీసుకోవడం మాత్రమే మార్గమమని స్పష్టం చేసింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR), కేంబ్రిడ్జి యూనివర్సిటీ, ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌, కోపెన్‌హాగెన్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు సహా మరికొందరు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. 2020లో దిల్లీలో కరోనా విజృంభణకు కారణమైన వేరియంట్‌ను కచ్చితంగా చెప్పలేమన్న బృందం.. కొన్ని కేసుల్లో ఆల్ఫా వేరియంట్‌ బయటపడిందని పేర్కొంది. అది కూడా ఎక్కువగా విదేశీ ప్రయాణికుల్లోనని తెలిపింది. అయితే 2021 మార్చి నాటికి దిల్లీలో ఈ వేరియంట్‌ కేసులు 40 శాతం వెలుగుచూశాయని.. అనంతరం ఏప్రిల్‌లో డెల్టా విజృంభించిందని వివరించింది. కేంబ్రిడ్జి యూనివర్సిటీ శాస్త్రవేత్త రవి గుప్తా మాట్లాడుతూ.. 'అంటువ్యాధులను అంతం చేయడంతో హెర్డ్‌ ఇమ్యూనిటీ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ దిల్లీ వాసులపై గత వేరియంట్లు చూపిన ప్రభావం ప్రజలు హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించేందుకు సరిపోదు. ఇది సాధించేందుకు ఉన్న మార్గం డెల్టా వేరియంట్‌ సోకి దాని నుంచి కోలుకోవడం లేదా.. బూస్టర్‌ డోసు ద్వారా హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడం' అని పేర్కొన్నారు. 2020 నవంబర్‌లో రాజధాని దిల్లీలో ప్రతిరోజు దాదాపు 9వేల కొవిడ్‌ కేసులు నమోదయ్యేవి. డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది మార్చి మధ్యలో ఆ సంఖ్య తగ్గింది. కానీ మరుసటి నెల నుంచి పరిస్థితులు మారిపోయాయి. మార్చిలో 2వేలుగా నమోదైన కేసులు ఏప్రిల్‌లో 20వేలకు పెరిగిపోయాయి. అనంతరం రోజూ వేలల్లో కేసులు నమోదవుతూ వందల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లు లభించక ఆసుపత్రి ఆవరణలోనే ప్రాణాలు పోయిన ఘటనలు ఎన్నో. కాగా దిల్లీలో ప్రస్తుతం వైరస్‌ తగ్గుముఖం పట్టింది.

Post a Comment

0Comments

Post a Comment (0)