కటిక విషం

Telugu Lo Computer
0


కస్తూరీ మృగం అంటే ఒక రకమైన జింక! సీజన్ వచ్చినపుడు దాని బొడ్డు నుంచి ఒక రకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది.      అది మంచి మదపు వాసనగా ఉంటుంది.  అప్పుడు ఆ వాసన ఎక్కణ్ణించి వస్తున్నదా ..? అని ఆ జింక వెదకడం మొదలుపెడుతుంది. ఆ వాసన తనవద్ద నుంచే వస్తున్నది అని అది గ్రహించలేదు, ఆ అన్వేషణలో అలా అడవంతా తిరిగీ తిరిగీ చివరికి ఏదో ఒక పులి నోట్లో అది పడిపోతుంది, ప్రాణాలు కోల్పోతుంది ..!

 మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా వ్యర్ధంగా ఇలాగే తిరుగుతూ ఉంటాడు, పుణ్యక్షేత్రాలనీ, తీర్ధయాత్రలనీ, అనవసరంగా తిరిగి కాలాన్నీ వృధా చేసుకుంటూ ఉంటాడు .

పాండవులు తీర్ధయాత్రలకు వెళుతూ శ్రీకృష్ణుణ్ణి కూడా తమతో తోడుగా రమ్మని పిలుస్తారు ..

ఆయన చిరునవ్వు నవ్వి వారికొక దోసకాయ నిచ్చి, ‘నా ప్రతినిధిగా దీనిని తీసుకువెళ్ళి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనిని ముంచండి!’అని చెబుతాడు. వారు అలాగే చేసి తీర్ధయాత్రలు ముగించి తిరిగి వస్తారు, అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి, వారికి వడ్డింపచేస్తాడు శ్రీకృష్ణుడు, ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది .. 

’ఇది చేదు దోసకాయ ..’

’కటికవిషంలాగా ఉంది ..’

’ఇలాంటి వంటకం చేయించావేమిటి ..?’ అని పాండవులు అడుగుతారు. 

శ్రీకృష్ణుడు నవ్వి, ‘ఎన్ని గంగలలో మునిగినా, ఈ దోసకాయ చేదు పోలేదు,  ఎన్ని తీర్ధయాత్రలు చేసినా, మనిషిలో మౌలికంగా ఎలాంటి మార్పూ రాద’ని శ్రీకృష్ణుడు, ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు, ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యం ..!

మనిషి ప్రయాణం బయటకు కాదు, లోపలకు జరగాలి, యాత్ర అనేది బయట కాదు, అంతరికంగా యాత్రను మనిషి చెయ్యాలి, ఈ ప్రపంచమంతా మనిషి తిరిగినా, తనలో మార్పు రాని పక్షంలో, ఏమీ సాధించలేడు, అదే తనలోనికి, తాను ప్రయాణం చేస్తే, ఉన్న గదిలో నుంచి కదలకుండా కూడా జ్ఞానాన్ని పొందవచ్చు, మహర్షులు, మునులు ఒకచోట స్థిరంగా కూచుని తపస్సు చేసి జ్ఞానసిద్ధిని పొందారు. కేవలం గ్రంథాలను,  ఇంట్లో పెట్టుకోవడం వలన లాభం శూన్యం, చదివి తర్వాత, ఆచరణలో తీసుకుని వస్తే శుభం కలుగుతుంది ..

Post a Comment

0Comments

Post a Comment (0)