ఏపీ సమాచార శాఖ ఫోన్లు బంద్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఫలితాలు బయటకు రానున్నాయి. ఈ సమయంలో అధికారికంగా సమాచారం ఇచ్చే ఏపీ సమాచార శాఖ ఫోన్లు బంద్ అయ్యాయి. ప్రభుత్వం ఆ శాఖకు సంబంధించి బిల్లులు చెల్లించకపోవటంతో అధికారుల నుంచి సిబ్బంది వరకు అందరి ఫోన్లు పని చేయటం లేదు. సమాచార శాఖలో ఫోన్లు బంద్ కావడం ఇది రెండోసారి.బిల్లులు చెల్లించకపోవడంతో ప్రొవైడర్లు సర్వీసును నిలిపివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిషత్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలో ఫోన్లు పనిచేయకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 13 జిల్లాలకు సంబంధించి మొత్తం సమాచారశాఖ అధికారుల ఫోన్లు బంద్ అయ్యాయి. దీంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కౌంటింగ్ నేపథ్యంలో ఏదైనా సమాచారం ఇవ్వాలన్నా, రిసీవ్ చేసుకోవాలన్నా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు, మీడియా ప్రతినిధులు వెళ్లే అవకాశం లేదు. దీంతో వారికి సమాచారం ఇవ్వాలన్నా ఫోన్లు పనిచేయడంలేదు. దీంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో ఈ శాఖకు చెందిన అధికారులు తమ ఉద్యోగుల వ్యక్తిగత నెంబర్ల వివరాలతో కూడిన ఈ షీట్ ను మీడియా గ్రూపుల్లో పెట్టారు. సమాచారం కోసం ఈ నెంబర్లకు కాంటాక్ట్ చేయాలన్నారు. అంటే సర్కారు పనికి సమాచార శాఖ ఉద్యోగుల సొంత ఫోన్లు తో పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తమ పధకాలు.. నిధుల విడుదల సమయంలో పెద్ద ఎత్తున పత్రికలకు ప్రకటనలు ఇస్తోంది. దీని కోసం కోట్ల రూపాయాలు వెచ్చిస్తున్నారు. ఈ మొత్తం సమాచార శాఖ కు కేటాయించిన బడ్జెట్ నుంచే చెల్లింపులు చేస్తారు. అయితే, ఫోన్ బిల్లులు ఒక్క రోజుల పేమెంట్ తేదీతో జారీ అయ్యేవి కావు. సాధారణంగా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన బిల్లులు ఆటో మేటిక్ గా చెల్లింపులు జరిగిపోతాయి. అయితే, ఏపీలో ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక ఆర్దిక పరిస్థితుల కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్లుగా తెలుస్తోంది. సమాచార శాఖ అధికారులు ఈ బిల్లుల చెల్లింపు పైన ఆర్దిక శాఖ అధికారులను అప్రమత్తం చేయలేదా..చేసినా, ఆర్దిక శాఖ నుంచి సాధారణంగా జరిగే ఫోన్ బిల్లులను చెల్లించలేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రభుత్వం - ప్రజల మధ్య వారధిగా పని చేసే సమాచార శాఖ అధికారులు-సిబ్బంది ఫోన్లు బిల్లులు కట్టని కారణంగా నిలిచిపోవటం ఇప్పుడు విపక్షాలకు మరో ఆయుధంగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అంతా ఓట్ల లెక్కింపు హడావుడి..అదే విధంగా సెలవు రోజు కావటంతో ముఖ్య అధికారులు అందుబాటులోకి రాకపోవటంతో దీని పైన అధికారికంగా స్పందన రాలేదు. వెంటనే సమస్య పరిష్కరిస్తామని అధికారులు చెప్పినట్లుగా సిబ్బంది ద్వారా తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)