మరి నిజంగా ప్రక్కవాళ్ళ పూలు కోసి చేసే పూజకి ఏమి ఫలితం వస్తుంది, దీని గురించి శాస్త్రాలు ఏమంటున్నాయి ???
నిజానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు. దేవుని పూజకోసమని మొక్కని ప్రార్దించి.. కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహా పాపం.
ప్రక్కవాళ్ళని అడగకుండా పూలు కోసేయడం దొంగతనం క్రిందకి వస్తుంది. అందుకు శిక్షగా మళ్ళీ జన్మలో వారు భయంకరమైన అడవిలో కోతిలా పుడతారు. కోసినప్పుడల్లా అడిగి కోస్తుండాలి. ఒక వేళ వాళ్ళు ఒప్పుకుంటే, అప్పుడు కూడా మొక్కల యజమానికి పూజలో సగం పుణ్యం వెళ్ళీపోతుంది.. ఈ విషయాలు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వయంగా తన మాటలుగా గరుడ పురాణంలో గరుడునికి చెప్పారు. ఈ శ్లోకం చూడండి...
తాంబూల ఫల పుష్పాది హర్తాస్యా ద్వానరో వనే |
ఉపానతృణ కార్పాసహర్తాస్సా న్మేష యోనిషు ||
తాత్పర్యం...
తాంబూలము, ఫలములు, పుష్పములు మొదలగు వానిని అపహరించినవాడు అడవిలో కోతిగాను. పాదుకలు, గడ్డి, ప్రత్తి మొదలగు వానిని అపహరించినవాడు మేక జన్మము గాను పుట్టుచుందురు.
మరి పూజ చేస్తే పుణ్యం రావాలి, దానివల్ల మోక్షం, ముక్తి కలగాలి. లేదా కనీసం వచ్చే జన్మలో ఇంకా మంచి పుణ్యవంతమైన జీవితం కలగాలి. నిజానికి మానవ జన్మ యొక్క ఏకైక లక్ష్యం ముక్తిని పొందడమే.. ఇక జన్మలనేవే లేని విధంగా ఆ భగవంతునిలో ఐక్యం ఐపోడమే.. అది కేవలం మనిషి జన్మలో మాత్రమే సాధ్యం, ఇక ఏ ఇతర జన్మలలోనూ సాధ్యమే కాదు.