భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా నేతృత్వంలో 2017లో ఏర్పాటైన క్వాడ్ కూటమిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకుని ఏర్పడే కూటములను ఎవరూ పట్టించుకోరని, వాటికి భవిష్యత్తు ఉండదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ మండిపడ్డారు. ప్రాంతీయ సహకారం కోసం సమయానికి అనుగుణంగా నడుచుకోవాలని, దేశాల మధ్య పరస్పర సహకారం, నమ్మకం ఉండాలని.. అంతేకానీ కూటమిగా ఏర్పడి ఇతర దేశాల ప్రయోజనాలకు దెబ్బ కొట్టకూడదని అన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్ర మార్గాలను ఫ్రీగా ఉంచేందుకు మరియు ప్రపంచంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటైన క్వాడ్ కూటమి కీలక భేటీ సెప్టెంబర్- 24న జరగనుంది.కోవిడ్ నుంచి కోలుకునేందుకు “ఆశ ద్వారా పునరుజ్జీవం” అనే నినాదంతో సాగనున్న ఈ సదస్సులో కూటమికి చెందిన దేశాధినేతలు తొలిసారిగా సమావేశం కానున్నారు. క్వాడ్ కూటమి 2017లో ఏర్పాటు కాగా.. 2021 మార్చిలో సంబంధిత దేశాధినేతలు వర్చువల్గా భేటీ అయ్యారు. వీరు ఈ నెలలో నేరుగా భేటీ అవ్వడం తొలిసారి కానుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలో వాషింగ్టన్ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ హాజరుకానున్నారు. ఈ నలుగురు నేతలు పలు అంశాలపై ప్రత్యక్షంగా చర్చిస్తారని వైట్హౌజ్ ఓ ప్రకటనలో తెలిపింది. కోవిడ్19పై పోరాటంలో సహకారంతో పాటు ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా వ్యవహారం , ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు, అఫ్ఘానిస్తాన్ పరిస్థితులు వంటి అంశాలను చర్చించనున్నారు.