ప్రస్తుత దేశీయ మార్కెట్లో భవిష్యత్ అవసరాల పేరిట కార్పొరేట్ సంస్థలు ఐపీవోల ద్వారా నిధుల సేకరణ ముమ్మరం చేశాయి. తాజాగా క్యాబ్ అగ్రిగేటర్.. ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా తన భవిష్యత్ ప్రణాళికలకు అవసరమైన నిధుల సేకరణకు కార్యాచరణ వేగవంతం చేసింది. తాజాగా ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు సిటీ గ్రూప్, కొటక్ మహీంద్రా బ్యాంక్, మోర్గాన్ స్టాన్లీ సంస్థలను ఓలా ఎంచుకున్నట్లు సమాచారం. బిలియన్ డాలర్ల నిధుల సేకరణ లక్ష్యంతో ముందుకువెళుతున్న ఓలా సంస్థలో జపాన్కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్, టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్ పెట్టుబడులు పెట్టాయి. 800 కోట్ల డాలర్ల పై చిలుకు నిధుల సేకరణకు ఐపీవోకు వెళ్లేందుకు అనుమతించాలని సెబీని ఓలా అక్టోబర్లో కోరనున్నదని తెలుస్తున్నది. ఐపీవోకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. దాని సైజ్ ఖరారైతే, ఐపీవో నిర్వహణ బాధ్యతల్లో మరికొన్ని బ్యాంకులు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓలా ఐపీవో నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించడానికి సిటీ బ్యాంక్ ప్రతినిధి నిరాకరించారు. ఓలా క్యాబ్ సర్వీస్లో ప్రస్తుతం దేశంలోని 250 నగరాల పరిధిలో 15 లక్షల మంది డ్రైవర్లు భాగస్వాములుగా ఉన్నారు.
Post a Comment
0Comments
3/related/default