అక్కడ ప్లేటు భోజనం రూ.7 వేలు!
August 27, 2021
0
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను స్వాధీనం చేసుకున్న తరువాత అక్కడ అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్లు శాంతి వచనాలు ప్రవచిస్తున్నప్పటికీ అక్కడి వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటంతో ప్రజలు బతుకు జీవుడా.. అంటూ ఏదో ఒక దేశానికి తరలిపోయేందుకు కాబుల్ విమానాశ్రయం వద్దకు భారీగా చేరుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కడి ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణానాతీతంగా ఉన్నాయి. ఎలాగైనా దేశం దాటిపోవాలనే ఉద్దేశంతో రోజుల తరబడి వేచిచూస్తున్న అక్కడి ప్రజలకు తిండి, తాగునీరు కూడా కరువైంది. దీంతో చిన్నారులు, మహిళల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. విమానాశ్రయం బయట దుకాణాల్లో వస్తువుల ధరలకు రెక్కలొచ్చి ఆకాశాన్ని తాకాయని అఫ్గాన్కు చెందిన ఫజల్ ఉర్ రెహమాన్ అనే వ్యక్తి 'రాయిటర్స్' వార్తా సంస్థకు తెలిపారు. ఒక వాటర్ బాటిల్ ధర 44 అమెరికన్ డాలర్లు (రూ.3 వేలు) కాగా.. ప్లేటు భోజనం ధర ఏకంగా 100 డాలర్ల (రూ.7000కు పైనే)కు విక్రయిస్తున్నట్టు చెప్పాడు. విమానాశ్రయం బయట ధరలు సామాన్యుడికి అందుబాటులో లేవంటూ ఫజల్ ఉర్ రెహమాన్ చెప్పిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.