తెరుచుకున్న జూపార్కు
July 11, 2021
0
కరోనా కారణంగా మూతపడిన నెహ్రూ జులాజికల్ పార్క్ తిరిగి 70 రోజుల తర్వాత తెరుచుకుంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సందర్శకులను అనుమతిస్తున్నారు. కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా పార్కులు, జంతు ప్రదర్శన శాలలు తెరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఇందులో భాగంగా హైదరాబాద్లో ప్రసిద్ధిగాంచిన నెహ్రూ జూలాజికల్ పార్కు ఆదివారం సందర్శకులతో కళకళలాడింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత మాస్కులు ధరించిన వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. టికెట్ కౌంటర్ల వద్ద భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. లాక్డౌన్ కాలంలో పార్కును శుభ్రంగా ఉంచామని, జంతువులు ఉండే ఎన్క్లోజర్లను రోజుకు పలుమార్లు శానిటైజ్ చేస్తామని జూ అధికారులు వెల్లడించారు. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా పార్కులో ఉమ్మిన వారికి రూ.100 జరిమానా విధిస్తామని, మాస్కులు లేకుండా తిరిగితే ఫైన్ విధించి బయటకు పంపుతామని తెలిపారు. సారీసృపాలు, నిషాచర జంతుశాల, ఎక్వేరియం, ఫాజిల్ మ్యూజియం మూసివేశామని అధికారులు తెలిపారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా జంతు ప్రేమికులు, సందర్శకులు జూపార్క్ను సందర్శించారు.