భారీ వర్షాలు, వరదలతో మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 138 మంది మరణించగా, డజన్ల మంది అచూకీ ఇంకా లభించలేదు. అనేక రోడ్లతోపాటు రెండు జాతీయ రహదారులపై రాకపోకలను నిలిపేయడంతో వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడడంలో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అనేక గ్రామాలు జలదిగ్భందనంలో చిక్కుకున్నాయి. దీంతో ముగినిపోయిన తమ ఇళ్ల పైకప్పులపైకి చేరుకున్న ప్రజలు అక్కడే చిక్కుకుపోయి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సంగ్లి జిల్లాలోని సంగ్లివాడి గ్రామంలోని దృశ్యాలు వరద తీవ్రత పరిస్థితికి అద్దం పడుతున్నాయి. వరద నీటిలో నివాసాలు చిక్కుకుపోవడంతో ప్రజలు ఇళ్లపైకి చేరిన ఘటనలతో పాటు ఒక లారీ డ్రైవర్ క్యాబిన్ స్థాయి వరకు నీరు చేరిన దృశ్యాలు కనిపించాయి. 2019 వరదల నాటి పరిస్థితులతో పోల్చుకుంటే ప్రస్తుతం అంత తీవ్రత లేకపోయినప్పటికీ, వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, ఇంకా ఇళ్లచుట్టూ చేరిన నీరు ఇంకా తగ్గలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వరద నీటిలో చిక్కుకుపోయిన కాస్బేదిగ్రాజ్ గ్రామ ప్రజలను అధికారులు సమీపంలోకి ఒక కాలేజ్లో ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించారు.