శ్రీవిద్య పి. సుబ్రమణ్యన్ దర్శకత్వం వహించిన కుమార సంభవం లోని ఒక నృత్య సన్నివేశంతో మలయాళం చిత్రాలలో, దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం తాతా మనవడు (1972) తో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించింది. చట్టంబిక్కవల చిత్రంలో ఆమె సత్యన్ సరసన నాయికగా నటించింది. ఎ. విన్సెంట్ దర్శకత్వం వహించిన చెందా చిత్రంతో ఆమె ప్రజాభిమానాన్ని చూరగొంది. జూలీ చిత్రంతో పేరొందిన లక్ష్మి ఆమెకు సన్నిహితురాలు. మలయాళీ నటీమణి సీమకు ఆమె వస్త్రాల ఎంపికలో, అలంకరణలో కూడా శ్రీవిద్య సహాయం చేసింది.
1970ల మధ్య కాలంలో ఆమె తమిళ చిత్ర పరిశ్రమలో బాగా నిలదొక్కుకుంది. ఆమె నూత్రుక్కు నూరు ,సొల్లతాన్ నినక్కిరెన్, అపూర్వ రాగంగల్ వంటి చిత్రాలలో నటించింది. చివరి రెండు చిత్రాలకు కె. బాలచందర్ దర్శకత్వం వహించారు. అపూర్వ రాగంగల్ (1975) చిత్రంలో ఆమె తమిళ చిత్రంలో అప్పటి వర్ధమాన నటులు, ఇప్పటి సూపర్ స్టార్లు అయిన రజినీకాంత్ , కమల్ హాసన్ లతో నటించింది. ఈ చిత్రం ఆమె జీవితాన్నే మార్చివేసింది. ఆ చిత్రంలో ఆమె రజినీకాంత్ భార్యగా, కమల్ హాసన్ ప్రేయసిగా నటించింది. ఆ చిత్ర నిర్మాణ సమయంలో ఆమె కమల్ హాసన్ తో ప్రేమలో పడింది. వారికి వారి కుటుంబముల సహకారం ఉన్నప్పటికీ వారు విడిపోయారు. తరువాత ఆమె తన మలయాళం చిత్రం తీక్కనల్ సహాయ దర్శకుడు జార్జ్ థామస్ తో ప్రేమలో పడింది. తన కుటుంబం నుండి వ్యతిరేకత ఎదురైనా ఆమె అతనిని 1978 జనవరి 9న వివాహం చేసుకుంది. జార్జ్ కోరిక ప్రకారం వివాహానికి ముందు ఆమె బాప్టిజం స్వీకరించి క్రైస్తవ మతాన్ని పొందింది. ఆమె ఒక గృహిణిగా ఉండాలని కోరుకుంది, కానీ ఆర్ధిక సమస్యలను ఎత్తి చూపి జార్జ్ ఆమెను ఒత్తిడి చేసినప్పుడు నటనకు తిరిగి రావలసి వచ్చింది. అతనిని వివాహం చేసుకోవటం ఒక తప్పుడు నిర్ణయం అని ఆమె వెంటనే గ్రహించింది. ఆమె కుటుంబ జీవితం దయనీయంగా తయారైంది. ఆ వివాహం విడాకులతో ముగిసింది. తరువాత వారి మధ్య ఉన్న ఆర్ధిక వివాదముల పరిష్కారం కొరకు చాలాకాలం పాటు చట్టబద్ధమైన పోరాటం జరిగింది. ఆ కేసు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం వరకు వెళ్ళింది. అక్కడ అంతిమ తీర్పు ఆమెకే అనుకూలంగా వచ్చింది. విడాకులు తీసుకున్న తర్వాత, ఆమె చెన్నై వదిలి త్రివేండ్రంలో స్థిరపడింది.
శ్రీవిద్య ఒక మంచి గాయని కూడా. ఆమె మొదటిసారి అయలతే సుందరి అనే మలయాళ చిత్రంలో పాడింది. తరువాత ఆమె ఒరు పైన్కిలిక్కద, నక్షత్ర తరట్టు వంటి పలు చిత్రములలో పాడింది. ఆమె ఒక నిపుణురాలైన శాస్త్రీయ వయోలిన్ కళాకారిణి కూడా. ఆమె సూర్య ఫెస్టివల్ వంటి వేడుకలలో పాడుతూ ఉండేది.
2003లో శారీరిక ఇబ్బందుల తర్వాత ఆమె బయాప్సీ పరీక్ష చేయించుకుంది. ఆమెకు రొమ్ము కాన్సర్ ఉన్నట్లు ధృవపడింది. ఆమెకు మూడు సంవత్సరముల పాటు చికిత్స జరిగింది. అక్టోబర్ 2006లో, ఆమె రసాయన చికిత్స చేయించుకుంది. కానీ అప్పటికే కాన్సర్ ఆమె శరీరమంతటా వ్యాపించింది. 2006 అక్టోబరు 19 న ఆమె మరణించింది.