అలిమేలుమంగమ్మకి అలసటగా అనిపించింది. మగతకళ్ళను నలుపుకోని, *ఇంకా రాడేం నా నామాలస్వామి* అంటూ పలవరించింది. ఆ రోజు శుక్రవారం కావటంతో, ఆమెకీ భక్తుల తాకిడి ఎక్కువగానేవుంది. నిద్ర ముంచుకొస్తోంది. అయినా మునుపు ఏండుకొండలవాడు వచ్చినప్పుడు శుక్రవారం తప్పక వస్తానని చేసిన ప్రమాణం గుర్తుంది.ఎందుకే ఈ ఎదురుచూపులు.
బద్దకంగా లేచి నాలుగు అడుగులు వేసి గుమ్మందాకా వచ్చింది ఆ తల్లి. కనుచూపు సాగినంతవరకు పరికించి ఏడుకొండలవైపు చూసింది. ఏముంది... ఆయన జాడ లేదు సరికదా, ఇసుకేస్తే రాలనట్లు జనం కనిపించారు. ఇంకా వస్తున్నారు.. బస్సుల్లో, కార్లలో, కాలినడకన.. జనం జనం జనం. ఒక పక్క ఒక గుంపు *గోవిందా.. గోవిందా* అని అరిస్తే, అటువైపు వున్నాడేమో అని చూసింది. ఇంతలో మరోవైపు *ఏడుకొండలవాడా వేంకటరమణా...* అని మరో భక్తసమూహం కేకపెడితే, పోనీ అటువైపు కానీ వెళ్ళాడా అని చూసింది. ఎక్కడా ఆయన జాడే లేదు.
అలిమేలుమంగమ్మ మరికాస్త పరికించి, తిరుమల కొండపైకి దృష్టి సారించింది.ఇంకా పవళింపు సేవకి టికెట్లు ఇస్తున్నారు. *నారాయణా... ఇంకా సేవలు వున్నాయా? భక్తపక్షపాతం కాకపోతే ఎప్పుడూ వాళ్ళ సేవలేకానీ, మిమ్మల్ని సేవించి తరించే అవకాశం నాకు ఇవ్వవు కదా?* అంటూ నిట్టూర్చింది. చేసేదిలేక భారంగా అడుగులేసుకుంటూ లోపలికి వచ్చింది. ఆమె శ్రీవారు వస్తే అలంకరించాలనుకున్న వజ్రాలపతకం, పట్టుపీతాంబరం ఆపక్కనే తిరునామం తీర్చిదిద్దడానికి సర్దుకున్న సరంజామా అన్నింటినీ ఒక్కసారి చూసుకుంది.
*ఏం లాభం.. రావటమే ఆలస్యం... ఇంక వీటన్నింటికీ తీరికేది? అసలు ఆయన సక్రమంగా భోజనం చేసి ఎన్నాళ్ళైందో..* అనుకున్నది. ఆ ఆలోచన రాగానే, ఆయన కోసం ఏర్పాటు చేసిన భోజనాల సంగతి గుర్తొచ్చింది. *అయ్యో గోవిందా... అన్నీ చల్లంగా చల్లారిపోయి వుంటాయి...* అంటూ ఒక్కక్క పాత్రపైన మూత తీసి చూసింది. పులిహోర, చక్కర పొంగలి, దద్దోజనం, పాయసం ఇవికాక సాధకాలు, భక్ష్యాలు అన్నీ స్వహస్తాలుతో ప్రేమ రంగరించి మరీ చేసింది ఆ తల్లి. *అలిసిపోయి వస్తాడు... ఇక రుచిపచి కూడా తెలియదైపోయే... ఇంకా అందులో రంగరించిన ప్రేమని ఎక్కడ గుర్తిస్తాడు?* అనుకుంది పద్మావతి.
ఆ వంటకాల సువాసనలు ఆఘ్రాణించిన తరువాత అమ్మ కడుపులో ఆకలి రెండింతలైంది. *మధుసూధనా... త్వరగా రావయ్యా స్వామీ...* అంటూ చనువుగా అంది అక్కడే కూర్చుంటూ. *అంజనాద్రి వరకైనా వచ్చాడో లేక ఇంకా మాడవీధులైనా దాటలేదో...* అనుకుంటూ, ఆలోచిస్తూ క్రమంగా నిద్రలోకి జారుకుంది ఆ అన్నులమిన్న.
స్వామి పరుగులమీద వున్నాడు. అప్పుడెప్పుడో గజేంద్రుడు పిలిచినప్పుడు ఇలా పరిగెత్తాడు. ఈ మధ్య దాదాపు ప్రతిరోజూ ఇదే జరుగుతోంది.అప్పుడన్నా నయం, వచ్చిన దారి సులువైన గగనమార్గం... వద్దన్నా వెంటపరుగెత్తిన పరివారం. మరి ఇప్పుడో... కఠినమైన గుట్టలు, రాళ్ళు నిండిన కొండ దారి. ఇక పరివారమా? అంతా గుళ్ళోనే జోగుతున్నారు. పైగా స్వామీ వెళ్ళేది దేవేరి దగ్గరకేనని వాళ్ళకీ తెలుసు. అందుకే వెంట వస్తామని కూడా అనరు.
*పోనీ నేను రానా స్వామీ* అంది కౌముది అనే గద నిద్రకళ్ళతోనే.
*నువ్వొస్తే నాకు మోత బరువు తప్ప ఉపయోగం ఏముంది? ఆ గరుత్మంతుడు వస్తే ఉపయోగం కానీ* అన్నాడు ఒక మూల నిద్రపోతున్న గరుత్మంతుణ్ణి చూసి.
*పాపం అలసిపోయాడు స్వామీ* అంది కౌముది.
తప్పేదేముంది. దేవేరికి ఇచ్చిన మాట... ఆ మాట జవదాటి అలమేలుకి అలక తెస్తే ఆ అలక తీర్చేందుకు ఎన్ని పారిజాతాలు కావాలో, ఏమేమి సేవలు చెయ్యాలో.
*సరే నేను బయలుదేరుతున్నా... గుడి జాగ్రత్త...* అన్నాడు ద్వారపాలకులని చూస్తూ.
*అలాగే స్వామీ* అన్నారు జయవిజయులు ద్వారబంధం పక్కనే కూలబడుతూ.
స్వామి వడివడిగా నడవసాగాడు.
పద్మావతీవల్లభుడు తిరుచానూరులో గుడికి చేరేసరికి అంతా చీకట్లు కమ్ముకున్నాయి. దేదీప్యమానమైన వెలుగులతో, అంతకు రెండింతలు వెలిగే చంద్రబింబంలాంటి ముఖంతో అలుమేలుమంగ ఎదురొస్తుందని వూహించిన శ్రీనివాసుడు హతాసుడయ్యాడు.
*ఈ చీకట్లు కారణం దేవేరి అలక కాదుకదా?* అంటూ సందేహించాడు. అడుగులు వడివడిగా వేస్తూ, గుడి గడపలు దూకుతూ లోపలికి అడుగుపెట్టాడు. వెంకటేశ్వర పట్టపురాణి కఠినమైన రాతిపై వళ్ళు తెలియక నిద్రపోతోంది. ఆయన రాకతో పాటే లోపలికి ప్రవేశించిన సుగంధ వీచికలను ఆఘ్రాణించి చటుక్కున లేచి కూర్చున్నది అలుమేలుమంగమ్మ.
*వచ్చారా స్వామీ... ఏమిటింత ఆలస్యం? చూడండి మీకోసం వండినవన్నీ చల్లారిపోయాయి...* అంది ఆమె నిద్రతో చదిరిన సింధూరాన్ని సర్దుకుంటూ.
*వాటి సంగతి సరే... ముందు కాస్త స్థిమిత పడనీ..* అంటూ అక్కడే వున్న ఒక రాతి స్థంభాన్ని ఆనుకొని కూర్చున్నాడు దేవదేవుడు.
*అయ్యో... అక్కడ కూర్చున్నారేమండీ... అవునులే పగలంతే నిలబడే వుంటారయ్యే... కాళ్ళు నొప్పులు పుట్టాయేమో...* అంటూ పాంకోళ్ళను తొలగించింది.
*పైగా నీ కోసం పరుగులుపెట్టి వచ్చాను కదా...* అన్నాడు ఆయన. ఆమె తన కోమల హస్తాలతో సుతారంగా ఆయన పాదాలను నొక్కజూసింది.
శ్రీనివాసుడు ఆమెను వారించి – *వద్దు దేవీ, కొత్త పట్టుబట్టలు కట్టారు, అవి కొంచెం గరుకుగా వున్నాయి, నీ చేతులు కందేనేమో..* అన్నాడు.
జలజాక్షి మనోహరంగా నవ్వి – *ఇదంతా ప్రేమే.* అంది సిగ్గుపడుతూ. శ్రీనివాసుడూ నవ్వాడు. ఆలయమంతా వెలుగు పరుచుకుంది.
ఇంతలో గుమ్మం దగ్గర అలికిడి.. *ఎవరదీ.?* అన్నాడు గోవిందుడు. – *నేను చూస్తానుండండి... ఇంత రాత్రివేళ ఎవరో..* అంటూ గబగబా గర్భాలయం వెలుపలికి వచ్చింది ఆమె. ఎవరో నలుగురు సాధువులు.
*ఏమిటయ్యా ఇంత రాత్రివేళ?* అంది కోపంగా.
*నీకు తెలియనిదేముంది తల్లీ.. పైన స్వామివారి దర్శనం దుర్లభమైపోతోంది...క్షణకాల దర్శనం.. చూసినా చూడనట్టే వుంటోంది...* *ఒక్కసారి తనివితీరా చూద్దామని సాయంత్రం నుంచీ ఇక్కడే వేచి వున్నాము.* అన్నాడొక సాధువు భక్తిగా.
*ఓరి అసాధ్యులారా... ఇక్కడికీ దాపురించారా? మాకిద్దరికీ ఏకాంతమనేది ఒకటి వుండనిస్తారా లేదా?* అంది నిష్టూరంగా.
*తప్పే అమ్మా... కానీ ఏం చెయ్యగలం, స్వామివారితో నిముషం గడపాలంటేనే ఎంతో డబ్బు కావాలి... సాధువులం.. సామాన్యులం.. మా దగ్గర అంతంత డబ్బు ఎక్కడ వుంటుంది..* అంటూ ప్రాధేయపడుతూ నమస్కరించారు.
*మరి... ఆయనేమన్నా సామాన్యుడా... కాసులులేనిది వడ్డీకాసులవాడు ఎలా కనిపిస్తాడు...* అంటూ వాళ్లని పంపించే ప్రయత్నంలో వుండగా, వారి ముఖంలో కనిపించిన భక్తితాదాత్మత చూసి ఆగిపోయింది. వెనకకు తిరిగి చూస్తే వెనకే వెంకటేశ్వరుడు.