హైదరాబాద్ ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని సయ్యద్ అన్వర్ తన కూతురిని లైంగికంగా వేధిస్తున్న షారూఖ్ అనే వ్యక్తిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల కధనం ప్రకారం షారూఖ్ అనే యువకుడు తన కుమార్తెను వేధిస్తున్నాడని సయ్యద్ అన్వర్ గతేడాది పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అయినా పద్ధతి మార్చుకోని షారూఖ్ మళ్లీ వేధింపులకు పాల్పడ్డట్లు అన్వర్ పేర్కొన్నాడు. తన కూతురిని పెళ్లి చేసుకున్నానని, కాపురానికి పంపాలని పలుమార్లు అసభ్యకరంగా మాట్లాడంటూ, పథకం ప్రకారం మాట్లాడుకుందామని అన్వర్, షారూఖ్ ను పిలిచాడు. ఇద్దరూ ద్విచక్రవాహనంపై వెళుతున్న సమయంలో వెనుక కూర్చున్న అన్వర్ అదును చూసి షారుఖ్ గొంతుకోశాడు. ద్విచక్రవాహనం దిగి కొంతదూరం పరుగెత్తిన షారూఖ్ ఫలక్నుమా బస్డిపో సమీపంలో మరణించాడని పోలీసులు తెలిపారు.
సీసీటీవీ దృశ్యాల ఆధారంగా షారుఖ్ను హత్యచేసింది అన్వరేనని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.