పెట్రో ధరల పెంపుకు అంతుపంతూ లేకుండా పోయింది. ఈరోజు (ఆదివారం) లీటర్ పెట్రోల్పై 29 పైసలు, డీజిల్పై 28 పైసలు పెంచుతూ దేశీయ ఇంధన విక్రయ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.36కు.. డీజిల్ రూ.95.44కు చేరుకుంది. రాజస్థాన్లోని శ్రీగంగానగర్ జిల్లాలో దేశములోనే అత్యధికంగా లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.108.37కి చేరడం గమనార్హం. ఇప్పటికే మొత్తం 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 పైకి ఎగబాకిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లద్దాఖ్, కర్ణాటక ఉన్నాయి.
హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.101.04గా, డీజిల్ రూ.95.89గా నడుస్తోంది. దేశ రాజధాని దిల్లీలో ఈ రేట్లు వరుసగా.. రూ.97.22, రూ.87.97గా ఉన్నాయి. మే 4 తర్వాత పెట్రో ధరలు పెరగడం ఇది 27వ సారి. ఈ 48 రోజుల్లో లీటర్ పెట్రోల్ రూ.6.82, లీటర్ డీజిల్ రూ.7.24 ప్రియమైంది. అంతకుముందు ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దాదాపు 18 రోజుల పాటు ధరల పెరుగుదల నిలిచిపోయింది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో పాటు దేశీయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన అధిక పన్నులే భారీ పెట్రో ధరలకు ప్రధాన కారణాలు. అయితే, గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ ధరలు కాస్త తగ్గినప్పటికీ దేశీయంగా ధరలు మాత్రం పెరగడం గమనార్హం. అయితే, ఇటీవలి ఎన్నికల సందర్భంగా ధరల పెంపును నిలిపివేసిన సమయంలో తలెత్తిన నష్టాల నుంచి కోలుకోవడానికే ఇంధన విక్రయ సంస్థలు ధరల్ని పెంచుతున్నాయని సమాచారం.