కరోనా సెకండ్ వేవ్ తో జనం అల్లాడుతుంటే ఫంగస్ ఇన్ఫెక్షన్లు కలకలం రేపుతున్నాయి. పలు రాష్ట్రాలలో బ్లాక్ ఫంగస్ కేసులు, మరణాలు పెరుగుతుంటే, కొత్తగా వైట్ ఫంగస్ వెలుగుచూసింది. బిహార్లోని పాట్నా మెడికల్ కాలేజీలో నాలుగు వైట్ ఫంగస్ కేసులు నమోదయినట్లు పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మైక్రో బయాలజీ హెడ్ డాక్టర్ ఎస్ ఎన్ సింగ్ తెలిపారు. కరోనాలానే వైట్ ఫంగస్ కూడా ఊపిరితిత్తులను దెబ్బతిస్తుందని చెప్పారు. సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే ఊపిరితిత్తుల నుంచి గోళ్లు, చర్మం, కడుపు, మూత్రపిండాలు, మెదడు, మర్మాంగాలు, నోటికి వ్యాపించే ప్రమాదముందని హెచ్చరించారు.
కరోనా లక్షణాలతో ఉన్న నలుగురు వ్యక్తులకు పరీక్షలు చేయగా ఫలితాల్లో నెగెటివ్ వచ్చింది. కానీ వారిలో మాత్రం కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. మరోసారి హెచ్ ఆర్ టి సి పరీక్షలు చేశారు. కరోనా నెగెటివ్ వచ్చింది. ఈసారి మ్యూకస్ కల్చర్ను పరీక్షించగా వైట్ ఫంగస్ బయటపడింది. ఊపిరితితుల్లో వైట్ ఫంగస్ ఉన్నట్లు తేలడంతో వెంటనే యాంటి ఫంగల్ డ్రగ్స్ ఇచ్చారు. అనంతరం వారు కోలుకుంటున్నారని డాక్టర్ ఎస్ ఎన్ సింగ్ తెలిపారు. ప్రారంభ దశలో గుర్తిస్తే ప్రమాదమేమీ ఉండదని, ఆలస్యంగా గుర్తిస్తే మాత్రం ప్రాణాలకే ముప్పని అన్నారు. బ్లాక్ ఫంగస్ వ్యాధి కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కనిపిస్తోందని.. కానీ వైట్ ఫంగస్ మాత్రం కరోనా లక్షణాలున్న వారిలో బయటపడుతోందని పేర్కొన్నారు.
ఇది బ్లాక్ ఫంగస్ కన్నా ప్రమాదకారని పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఎక్కువగా కనిపించి.. కరోనా నెగెటివ్ వస్తే, ఖచ్చితంగా మ్యూకస్ కల్చర్ పరీక్ష చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారితో పాటు డయాబెటిస్ రోగులు, చాలా కాలంగా స్టెరాయిడ్స్ తీసుకుంటున్న వారు ఎక్కువగా వైట్ ఫంగస్ బారినపడే అవకాశహుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు బిహార్లో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు మరణించారు. అంతలోనే వైట్ ఫంగస్ కేసులు వెలుగు చూడడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.