ఒడిశా ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారిణి సుజాత ఆర్.కార్తికేయన్ను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ భాజపా ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే ప్రజా వ్యవహారాలకు సంబంధం లేని విభాగానికి తక్షణం బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ సన్నిహితుడైన వీకే పాండియన్ సతీమణి సుజాత. దాంతో ఆమె ట్రాన్స్ఫర్ రాష్ట్రంలో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బదిలీకి ముందు మిషన్ శక్తి విభాగంలో సుజాత కమిషనర్ కమ్ సెక్రటరీ హోదాలో విధులు నిర్వర్తించారు. ఆమె రాష్ట్రంలో బీజేడీ ఏజెంట్గా పని చేస్తున్నారంటూ ఈసీకి చేసిన ఫిర్యాదులో కాషాయ పార్టీ పేర్కొంది. ఇదిలాఉంటే.. వీకే పాండియన్ కూడా ఐఏఎస్ అధికారే. గత ఏడాది ఆయన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి, బీజేడీలో చేరారు. 2019 ఎన్నికల ముందు నుంచి పాండ్యన్ సీఎంకు నమ్మకమైన అధికారి అయ్యారు. తెర వెనక ఉంటూ పాలనలో, బిజద పార్టీలో కీలకమయ్యారు. ఉద్యోగ విరమణ అనంతరం పార్టీ వ్యక్తిగా మారిపోయారు. నవీన్ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే ఆయన్ను విమర్శకులు 'సూపర్ సీఎం' అని పిలుస్తుంటారు.
'సూపర్ సీఎం' సతీమణి సుజాతపై ఎన్నికల సంఘం బదిలీ వేటు
May 03, 2024
0
Tags