అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా ఆ పార్టీ నేతలు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్నివాస్ గోయల్, డిప్యూటీ స్పీకర్ రాఖీ బిల్లా, మంత్రులు అతిశ్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్తోపాటు ఆ పార్టీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని నామరూపాలు లేకుండా చేయడం కోసమే బీజేపీ ఈ తరహా కుట్ర పన్నిందని మంత్రి గోపాల్ రాయ్ ఆరోపించారు. అందులో భాగంగానే డిల్లీ మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసిందన్నారు. ఈ నిరాహార దీక్షలో పాల్గొనాలని ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి గోపాల్ రాయ్ పిలుపు నిచ్చారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా దేశ విదేశాల్లో ఆప్ నేతలు ఈ తరహా నిరాహార దీక్షలు చేపట్టారు. పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ సింగ్ మాన్ ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్ స్వగ్రామం కత్కర్ కలాన్లో దీక్ష చేపట్టారు. ఈ నిరాహార దీక్షకు ప్రజలు పోటెత్తారు. ఇంకోవైపు విదేశాల్లో సైతం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా ఈ దీక్షలు చేపట్టారు. బోస్టన్లో హార్వర్డ్ స్క్వేర్ వద్ద, లాస్ ఏంజెల్స్లో, వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం వెలుపల, టోరంటో, లండన్, మెల్బోర్న్లో ఈ నిరాహార దీక్షలు చేపట్టినట్లు ఆప్ నేతలు వివరించారు.
అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా సామూహిక నిరాహార దీక్ష !
April 07, 2024
0
Tags