ప్రజా సంక్షేమ హామీలతో తృణమూల్‌ కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల !

Telugu Lo Computer
0


తృణమూల్‌ కాంగ్రెస్‌ మేనిఫెస్టోను విడుదల చేసింది. కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆ పార్టీ ముఖ్య నేతలు 'ఇండియా' కూటమిలో భాగంగా పలు ప్రజా సంక్షేమ హామీలతో మేనిఫెస్టో విడుదల చేశారు.కేంద్రంలో 'ఇండియా' కూటమి అధికారంలోకి వస్తే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతీ కుటుంబానికి ఏటా 10 వంట గ్యాస్‌ సిలిండర్లు, ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీ చేయడంతో పాటు ఎం.ఎస్‌. స్వామినాథన్‌ కమిటీ సిఫారసులను అమలుచేసి రైతులను ఆదుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ డెరిక్‌ ఓబ్రెయిన్‌ మాట్లాడుతూ.. దేశంలో సామాన్యుడికి భారంగా ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నియంత్రిస్తామని, ఇందుకోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే, సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను రద్దు చేయనున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత అమిత్‌ మిత్రా తెలిపారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబ్‌ కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ 100 రోజుల పాటు పని కల్పిస్తామని, రోజుకు రూ.400ల చొప్పున వేతనం చెల్లిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. వెనకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఇచ్చే స్కాలర్‌ షిప్‌లను మూడు రెట్లు పెంచనున్నట్లు హామీ ఇచ్చారు. సీట్ల వ్యవహారంలో నెలకొన్న విబేధాలతో బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఒంటరిగానే పోటీ చేస్తున్నప్పటికీ.. 'ఇండియా' కూటమిలో తాము భాగంగానే ఉన్నట్లు పేర్కొంటోంది. బెంగాల్‌లో ఈసారి తృణమూల్‌, భాజపా మధ్య హోరాహోరీ పోరు నెలకొనగా కాంగ్రెస్‌- లెఫ్ట్‌ పార్టీలు కలిసి లౌకిక కూటమిగా బరిలో నిలుస్తున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)