ఇండిగోలో భద్రతా వైఫల్యం ?

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్ లోని అయోధ్య నుంచి ఢిల్లీ బయల్దేరిన ఇండిగో  విమానానికి ప్రమాదకర పరిస్థితి ఎదురైంది. వాతావరణం సహకరించకపోవడంతో దానిని చండీగఢ్‌కు మళ్లించార అయితే, అక్కడ ల్యాండింగ్‌ సమయంలో విమానంలో కేవలం రెండు నిమిషాలకు సరిపడా ఇంధనమే మిగిలి ఉంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వారు సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ''సాయంత్రం 3.25కు అయోధ్య నుంచి విమానం బయల్దేరింది. అదేరోజు 4.30 గంటలకు ఢిల్లీకి చేరుకోవాలి. అయితే, గమ్యస్థానానికి 15 నిమిషాల ముందు పైలట్ నుంచి ప్రకటన వచ్చింది. వాతావరణం సహకరించకపోవడంతో విమానం ల్యాండింగ్‌ క్లిష్టంగా మారిందని, ఇంధనం అయిపోతోందని తెలిపారు. ఇది ప్రయాణికుల్లో తీవ్ర గందరగోళానికి దారితీసింది. అయితే విమానం అక్కడక్కడే గాల్లో తిరుగుతూ రెండుసార్లు ల్యాండింగ్‌కు యత్నించినా ఫలితం లేదు. చివరకు చండీగఢ్‌కు మళ్లించారు. అక్కడ సురక్షితంగా దింపారు. అయితే ఆ సమయానికి విమానంలో కేవలం 1-2 నిమిషాలకు సరిపడా ఇంధనం మాత్రమే మిగిలి ఉండగా మేం ల్యాండ్ అయ్యామని తెలిసింది'' అని ఒక ప్రయాణికుడు ఘటన మొత్తాన్ని ఓ పోస్టులో వివరించారు. దీనిని డైరెక్టరేట్‌ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన శాఖను ట్యాగ్ చేశారు. మీరు అసలు నియమావళిని పాటించారా..? అని ఇండిగో  సంస్థను ప్రశ్నించారు. ఇది పూర్తి భద్రతా వైఫల్యం.. దీనిపై డీజీసీఏ దర్యాప్తు చేయాలని మరో ప్రయాణికుడు డిమాండ్ చేశారు. అయితే ఫ్లైట్ రాడార్ డేటా ప్రకారం.. ఒకసారి మాత్రమే దిల్లీలో దింపేందుకు పైలట్‌ ప్రయత్నించారని, రెండోయత్నానికి అనుమతి లభించకపోవడంతో చండీగఢ్‌కు మళ్లించినట్లు ఉంది. దీనిపై విమానయాన సంస్థ నుంచి ప్రస్తుతానికి ఎలాంటి స్పందనా రాలేదు.


 

Post a Comment

0Comments

Post a Comment (0)