లోక్సభ ఎన్నికల్లో మరో రెండు స్థానాలకు భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను ప్రకటించింది. చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వరంగల్ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను భారాస అధినేత కేసీఆర్ ప్రకటించారు. వరంగల్ లోక్సభ పరిధిలోని నేతలతో సమావేశమైన అనంతరం అభ్యర్థిత్వాలను ప్రకటించారు. ఈ రెండు చోట్లా భారాసకు సిట్టింగ్ ఎంపీలు ఉన్నప్పటికీ.. ఇతరులకు అవకాశం కల్పించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మళ్లీ పోటీకి ఆసక్తి చూపకపోవడంతో అక్కడ కాసాని జ్ఞానేశ్వర్కు అవకాశం ఇచ్చారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ రెండు దఫాలుగా ప్రాతినిధ్యం వహించారు. మరోమారు పోటీకి సిద్ధమన్న ఆయన... అవకాశం ఇవ్వకపోయినా పార్టీలో కార్యకర్తగా పనిచేస్తానని చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో సీనియర్ నేత కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్ కడియం కావ్య పేరును ఖరారు చేశారు. ఇప్పటికే ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన భారాస.. తాజా ప్రకటనతో మొత్తం ఏడుగురి అభ్యర్థిత్వాలు ప్రకటించింది.
భారాస అభ్యర్థులుగా కాసాని జ్ఞానేశ్వర్, డాక్టర్ కడియం కావ్య ఖరారు
March 13, 2024
0
Tags