పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి మిమి చక్రవర్తి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గంలోని స్థానిక నాయకత్వంపై మిమి చక్రవర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. వారితో తలెత్తిన అభిప్రాయబేధాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అంతకు రెండురోజుల ముందు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పదవులకు ఆమె రాజీనామా చేశారు. ''జాదవ్పుర్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశాను. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. సినిమా పరిశ్రమ నుంచి వచ్చానని కొందరు నా గురించి హేళనగా మాట్లాడారు. స్థానిక నాయకుల్లో కొంతమందిని నేను కలవలేకపోయి ఉండొచ్చు. అంతమాత్రాన వారితో నేను అమర్యాదగా వ్యవహరించినట్లు కాదు. రాజకీయాల్లో నైతికత ఏంటనేది నాకు అర్థం కావడం లేదు'' అని ఆమె వ్యాఖ్యానించారు. మరోవైపు మిమి చక్రవర్తి రాజీనామాను మమత బెనర్జీ ఆమోదించలేదని సమాచారం. 2019 ఎన్నికల్లో జాదవ్పుర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆమె.. భాజపా (అనుపమ్ హజ్రా), సీపీఎం (రంజన్ భట్టాచార్య) తరపున పోటీ చేసిన సీనియర్ నాయకులను ఓడించి విజయం సాధించారు.
టీఎంసీకి ఎంపీ మిమి చక్రవర్తి రాజీనామా
February 15, 2024
0
Tags